
వర్షించని మేఘం
సాక్షి, పెద్దపల్లి: పునాస మొదలైంది. జిల్లాలోని అందరు అన్నదాతలు ఇంకా మొగులు దిక్కు చూడక తప్పడంలేదు. అక్కడక్కడా తుంపర పడుతున్నా.. ఎక్కడా గట్టివాన పడింది లేదు. చెరువులు, కుంటలు, కాలువల్లోకి చుక్కనీరు వచ్చిందీ లేదు. రోహిణి కార్తె ముగిసింది. మృగశిర కార్తె మొదలైంది. వానదేవుడి దోబుచులాటతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
ముఖం చాటేసిన వానలు..
ఇప్పటికే జోరందుకోవాల్సిన వానలు.. ముఖం చాటేశాయి. మొదట్లో వేసిన పత్తి విత్తనాలు నీళ్లు లేక నేలలోనే మాడిపోతున్నాయని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. కొందరు మళ్లీ దుక్కులు దున్నుతూ రెండు, మూడుసార్లు విత్తనాలు వేస్తున్నారు. కానీ వానల్లేక అవి కూడా మొలుస్తాయో, లేదోనని బుగులుపడున్నారు. అడపాదడపా అక్కడక్కడా విత్తనాలు మొలకెత్తినా రెండు, మూడురోజులుగా పొడి వాతావరణం ఉండడంతో వడలిపోతున్నాయి.
వరి తర్వాత పత్తిదే అగ్రస్థానం..
జిల్లాలో వరి తర్వాత అత్యధికంగా పత్తి, మొక్కజొన్న సాగు చేస్తుంటారు. సీజన్కు ముందే మోస్తరు వర్షాలతో మురిపించిన వరుణుడు.. తీరా ముఖం చాటేయడంతో రైతన్న ఆందోళనలో పడ్డాడు. ఈసారి అదనుకు ముందే వర్షాలు పడతాయనే ఆశతో నార్లు పోసి, దుక్కులు దున్ని, పత్తి గింజలు వేసుకున్నాడు. తీరా చినుకు జాడ లేక.. తడి అసలే లేక పంట ఎండిపోతుండ డం చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. విత్తుకున్న గింజలకు నీటితడి కోసం నానాతంటాలు పడుతున్నాడు. జిల్లాలో దాదాపుగా 30శాతం మంది రైతులు ఇదే సమస్యతో బాధపడుతున్నారు.
2,76,076 ఎకరాల్లో సాగు
జిల్లాలో ఈ వానాకాలంలో 2,76,076 ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా. ఇందులో వ రి 2,12,500 ఎకరాల్లో, పత్తి 52,500 ఎకరాలు, మొక్కజొన్న 705 ఎకరాల్లో సాగు చేయనున్నా రు. ముందస్తుగా సాగు చేస్తే అధిక వర్షాలు కురిసినా దిగుబడికి ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో రైతులు సాగు చేశారు. ఒక్కోఎకరాపై రూ.9 వేల నుంచి రూ.10వేల వరకు ఖర్చుచేసినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం పత్తి మొక్కలను కాపాడుకునేందుకు కొందరు రైతులు బిందెల సాయంతో నీళ్లు పోయిస్తే, ఇంకొందరు స్ప్రింక్లర్లు, డ్రిప్పైపులతో బతికించుకునే ప్రయత్నం చేస్తున్నారు. .
జాడలేని చినుకు
అన్నదాత ఎదురుచూపు
నేలలోనే మాడిపోతున్న పత్తి విత్తనాలు
మళ్లీ విత్తుకోవాల్సి వస్తుందంటున్న రైతులు
మాడిపోతున్న పత్తి మొక్కలు చూపిస్తున్న ఈ రైతు పేరు సుధాకర్రెడ్డి. స్వస్థలం పెద్దపల్లి. నైరుతి రుతుపవనాలు ముందే రావడంతో గతనెలలో వర్షాలు కురిశాయి. దీంతో తనకున్న ఐదెకరాల్లో పత్తి సాగు చేశాడు. ఒక్కో ఎకరం దుక్కి దున్నేందుకు రూ.5వేలు, విత్తనాలకు రూ.2,400, కూలీల ఖర్చు రూ.1,200.. మొత్తంగా ఎకరాపై రూ.8,600 వరకు పెట్టుబడి పెట్టాడు. కానీ, వరణుడు ముఖం చాటేయటంతో పంటను కాపాడుకునేందుకు అన్నదాత నానాతిప్పలు పడుతున్నాడు.
ఈ చిత్రంలో పత్తి పంటను కాపాడుకునేందుకు స్ప్రింక్లర్లతో తడి పెడుతున్న రైతు పెద్దపల్లికి చెందిన గోపిడి తిరుపతి. తనకున్న ఐదు ఎకరాల్లో పత్తి వేశాడు. దుక్కి, విత్తనాలు తదితర ఖర్చుల కింద సుమారు రూ.43వేలపైనే ఖర్చుచేశాడు. తీరా వాన దోబుచులాడుతుండడంతో పత్తి మెలకలని కాపాడుకునేందుకు స్ప్రింక్లర్లతో భగీరథ ప్రయత్నం చేస్తున్నాడు.

వర్షించని మేఘం

వర్షించని మేఘం