
పేదల రక్తం తాగుతున్న బీజేపీ సర్కార్
● కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు
సిరిసిల్లటౌన్: పెంచిన నిత్యవసరాల ధరలను వెంటనే తగ్గించాలని కాంగ్రెస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మొగిలి సునీతారావు డిమాండ్ చేశారు. ధరలు తగ్గించాలంటూ మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మహిళా నేతలతో ధర్నా చేపట్టి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నిరుపేదల నడ్డి విరిచేలా నిత్యవసర సరుకుల ధరలు పెంచడం సమంజసం కాదన్నారు. బీజేపీ పాలనలో సంక్షేమం కరువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పెంచిన ధరలు తగ్గించాలని లేకుంటే పోరాటాలు ఉధృతం చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అంతకుముందు జై బాపు.. జై భీమ్.. జై సంవిదాన్.. కార్యక్రమం సందర్భంగా అంబేడ్కర్ చౌరస్తా నుంచి నేతన్న విగ్రహం వరకు వందలాది మహిళా కార్యకర్తలతో ర్యాలీ తీశారు. సంక్షేమ పాలన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. సిరిసిల్లలో డబుల్బెడ్ రూం లబ్ధిదారుల వద్దకు వెళ్లి భూమి పూజ నిర్వహించారు. రేషన్ షాపులో సన్నబియ్యం పంపిణీ చేశారు. అనంతరం సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేయడం జరిగిందని, మహిళలకోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత, సీనియర్ నాయకురాలు మడుపు శ్రీదేవి, జనరల్ సెక్రటరీ కోడం అరుణ, రోజా, సరిత, బ్లాక్ ప్రెసిడెంట్ రమాదేవి, టౌన్ ప్రెసిడెంట్ స్వరూప, ముసుకు పద్మ, రుక్మిణి, లహరి, హారిక, వనిత, రాజ్యలక్ష్మి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.