
ఆధార్ నవీకరణకు మరో ఏడాది పెంపు
కరీంనగర్ అర్బన్: ఆధార్ కార్డుల నవీకరణకు కేంద్రం మరో ఏడాది వరకు గడువు పొడిగించింది. 2026 జూన్ 30 వరకు ఆధార్ కార్డులను నవీకరించుకోవడానికి అవకాశమిచ్చింది. ఆ తర్వాత కూడా నిర్లక్ష్యం చేస్తే కార్డు సస్పెండ్ చేస్తారు. ఒకసారి ఆధార్ కార్డు సస్పెండైతే దానిని పునరుద్ధరించుకోవడానికి వివిధ ధ్రువపత్రాలు పెట్టి మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కార్డుల నవీకరణకు కొందరు ఉత్సాహం చూపుతుండగా అవగాహన లేనివారు మాత్రం దూరంగా ఉంటున్నారు. మరికొందరు మొబైల్ లో శ్రీమై ఆధార్శ్రీ యాప్ డౌన్లోడ్ చేసుకుని వివరాలను నవీకరించుకుంటున్నారు.
అన్నింటికీ ఆధారం
పదేళ్ల క్రితం కార్డులు పొందినవారందరూ నవీకరించుకోవాలని యూఐడీఐ నుంచి కార్డుదారులకు మొబైల్కు సంక్షిప్త సందేశాలు అందుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 2011– 12మధ్య ప్రాంతంలో 9 లక్షల మంది ఆధార్ కార్డులు తీయించారు. అప్పుడు ఊరూరా ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి ఆధార్ నమోదు చేయించారు. పదేళ్ల చెల్లుబాటు అయ్యేలా నిబంధనలు విధించారు. ప్రతీ పది సంవత్సరాలకు ఒకసారి ఆధార్ ను నవీకరించుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఆధార్ కార్డు అన్నిటికీ కీలకంగా మారింది. బ్యాంకు ఖాతాలు తెరవడం, విద్యార్థుల ప్రవేశాలు, పింఛన్లు, ఉద్యోగ నియామకాలు, రేషన్ కార్డులు, కల్యాణలక్ష్మి, షాదీముబాకర్, సీఎం ఆర్థికసాయం, రైతు భరోసా, రైతు బీమా వంటి పథకాలకు కూడా ఆధార్ ను తప్పనిసరి చేశారు. ఆధార్ అప్ డేట్ లేకుంటే కొందరికి రేషన్, పింఛన్లు కూడా ఆగిపోతున్నాయి. ఆధార్ కార్డులు తీసుకున్నప్పటికీ కొందరు అప్డేట్ చేసుకోలేకపోతున్నారు. ఇప్పటికే రెండు మార్లు గడువు పొడిగించిన కేంద్రం మరో ఏడాది వరకు ఆధార్ నవీకరణ గడువు పెంచింది.
ఏమేం కావాలంటే..
ఆధార్కార్డు నవీకరణకు ఏదైనా ప్రభుత్వ గుర్తింపుపత్రం తీసుకెళ్లాలి. చదువుకున్నవారు పదోతరగతి మార్కుల మెమో తీసుకెళ్తే సరి. ఓటరు గుర్తింపు కార్డు, రేషన్ కార్డు, ఉపాధి హామీ జాబ్ కార్డు, బ్యాంకు ఖాతా పుస్తకం, పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, మ్యారేజ్ సర్టిఫికెట్ వెంట తీసుకెళ్తే ఆధార్ నవీకరణ పూర్తి చేసుకోవచ్చు. జిల్లాలో పాత జనాభా లెక్కల ప్రకారం 10 లక్షల మంది జనాభా ఉన్నారు. ఇప్పుడు మరో లక్ష వరకు జనాభా పెరిగే అవకాశం ఉంది. వీరికి అనుగుణంగా ఆధార్ కేంద్రాలు పెంచాల్సిన అవసరం ఉంది.
● పదేళ్లకోసారి అప్డేట్ తప్పనిసరి