
సంగీతమే ఆయన ప్రాణం
● రాణిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు ● మూడుసార్లు బంగారు పతకాలు ● 26 ఏళ్లుగా కచేరీలు
జగిత్యాలరూరల్: అతడికి చిన్నప్పటి నుంచే చదువుతోపాటు సంగీతం అంటే ఎంతో ఇష్టం. తన సంగీతంతో జాతీయ, రాష్ట్రస్థాయిలో పలువురి మన్ననలు పొంది అవార్డులు కూడా అందుకున్నారు. ధర్మపురికి చెందిన గుండి జగదీశ్వర్శర్మ మేడిపల్లి మండలం వల్లంపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. రేడియో, టీవీ గాయకుడిగా పలు సంగీత కచేరీలు నిర్వహిస్తూ మన్ననలు పొందారు. పలు టీవీ సీరియల్స్కు సంగీతం అందించారు. మ్యూజిక్ డైరెక్టర్ కోటి, మాదవపెద్ది సురేశ్, ఆర్పీ పట్నాయక్తో కలిసి పలు సంగీత కచేరీల్లో పాల్గొన్నారు. 26ఏళ్లలో 1,596 కచేరీలు నిర్వహించారు. ఇందులో 120 బెస్ట్ సింగర్ అవార్డులు అందుకున్నారు. దివంగత ఎస్పీ బాలసుబ్రమణ్యం పేరున మూడుసార్లు, గంటసాల పేరున రెండుసార్లు అవార్డులు అందుకున్నారు. ఆయన సంగీత సేవలకు ఢిల్లీ యూనివర్సిటీ డాక్టరేట్ను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా అందించింది. ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి శతకం, వినాయక భక్తి గీతాలు, రాముని భక్తిగీతాలు, ఆంజనేయస్వామి భక్తి గీతాలు పాడి తన సంగీతాన్ని పలువురికి వినిపించారు.

సంగీతమే ఆయన ప్రాణం