పార్వతీపురం: అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా జిల్లాలో వృద్ధ పౌరుల కో సం ప్రత్యేక యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి తెలిపారు. శనివారం ఉదయం 6 నుంచి 8 గంటల వరకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో థీమాటిక్ యోగా విత్ సీనియర్ సిటిజన్స్ కార్యక్రమం జరగనుందన్నారు. వయస్సు పైబడిన వారి శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా ఎంతో దోహదపడుతుందని, శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం
12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఈనెల 21న (ఆదివారం) ఉదయం 6 నుంచి 8 గంటల వరకు పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవచ్చని పేర్కొన్నారు. ఆయుష్శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఆర్టీసీ ఉద్యోగుల నిజాయితీ
పాలకొండ రూరల్: విజయవాడ నుంచి పాలకొండ వస్తున్న సూపర్ లగ్జరీ బస్సు డ్రైవర్లు నిజాయితీ చాటుకున్నారు. బస్సులో ప్రయాణిస్తున్న ఉట్టిగుట్ట నాగేశ్వరరావు తన బ్యాగ్ను మరిచిపోయి విశాఖపట్నంలో దిగిపోయాడు. బ్యాగ్ గమనించిన డ్రైవర్లు పాలకొండ డిపోలో అందించారు. బ్యాగ్లో లక్ష రూపాయల నగదుతోపాటు వ్యక్తిగత వస్తువులు ఉన్నట్లు డిపో యాజమాన్యం గుర్తించింది. వెంటనే సెల్ ఫోన్లో బాధితులకు డిపో మేనేజర్ బీఎస్ఎన్మూర్తి సమాచారం అందించారు.
నాగేశ్వరరావు కుమార్తె జ్యోతి శుక్రవారం పాలకొండ డిపోకు చేరుకోవడంతో ఆర్టీసీ యాజమాన్యం బ్యాగ్తోపాటు మిగిలిన వస్తువులను అందజేసింది. విధి నిర్వహణలో నిజాయితీ చాటుకున్న డ్రైవర్లు బంగారునాయుడు, రమేష్లను యాజమాన్యం అభినందించింది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులతో పాటు వస్తువులకు భద్రత ఉంటుందని పేర్కొన్నారు.


