రామభద్రపురం: మండలకేంద్రంలోని బైపాస్ రోడ్డులో శుక్రవారం రాత్రి 8.20 సమయంలో లారీ ఢీ కొని కూరగాయల వ్యాపారి మృతి చెందాడు. ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలోని శ్రీరాంనగర్ కాలనీకి చెందిన చలమల చిన్న (63) రామభద్రపురం అంతరరాష్ట్ర కూరగాయల మార్కెట్లో దాదాపు మూడు దశాబ్దాలుగా కూరగాయల వ్యాపారం చేసుకుని జీవనం సాగిస్తున్నాడు.అయితే రోజూ మాదిరిగానే శుక్రవారం మార్కెట్ నుంచి ఇంటికి సైకిల్మీద వెళ్తుండగా జాతీయ రహదారి నుంచి కృష్ణాఫార్మసీ పక్కనుంచి కాలనీ లింక్ రోడ్డుకు సైకిల్ తిప్పుతున్న సమయంలో విజయనగరం నుంచి ఎదురుగా వస్తున్న లారీ వెనుకభాగాన ఢీ కొట్టింది. అలాగే మృతదేహాన్ని కృష్ణాఫార్మసీ నుంచి స్టార్ అన్నపూర్ణ రెస్టారెంట్ వరకు సుమారు 100 అడుగులు పైబడి లారీ ఈడ్చుకెళ్లింది. రోడ్డు ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే సీఐ శ్రీనివాసరావు, ఎస్సై జ్ఞానప్రసాద్లు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాడంగి సీహెచ్సీకి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


