భక్తిశ్రద్ధలతో..
విజయనగరంలో కనులపండువగా సాగుతున్న హనుమాన్ శోభాయాత్ర
హనుమజ్జయంతిని పురస్కరించుకుని హిందూ ధర్మ రక్షాసమితి జిల్లాశాఖ ఆధ్వర్యంలో మంగళవారం హనుమాన్ శోభాయాత్ర వైభవంగా సాగింది. భాజాభజంత్రీలు, కోలాట ప్రదర్శనలు, డప్పువాయిద్యాల నడుమ జై హనుమాన్ నామస్మరణతో విజయనగరం కోట కూడలి నుంచి గంటస్తంభం మీదుగా హనుమాన్ కూడలి వరకు శోభాయాత్ర సాగింది. పాత మహారాజా ఆస్పత్రి ప్రాంగణంలో నిర్వహించిన ఆధ్యాత్మిక సభలో ఆంధ్రప్రదేశ్ సాధుపరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి చేసిన ఆధ్యాత్మిక ప్రసంగం భక్తులను ఆకట్టుకుంది. కార్యక్రమంలో హిందూ ధర్మరక్షా సమితి రాష్ట్ర కార్యదర్శి నందివాడ వేణుగోపాల్, రాష్ట్ర ఉపాధ్యక్ష్యుడు ఆబోతుల శ్యామ్ సుందర్, జిల్లా ఇన్చార్జి రామ్ తరుణ్, సహాయ కార్యదర్శి రామ్రాజేష్, భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.
– విజయనగరం టౌన్


