● జీఆర్పీ అదుపులో ఇద్దరు నిందితులు
విజయనగరం క్రైమ్: విజయనగరం రైల్వే స్టేషన్లోని నాలుగో నంబర్ ఫ్లాట్ఫామ్పై 16 కేజీల గంజాయిని జీఆర్పీ సిబ్బంది సోమవారం పట్టుకున్నారు. ఈ మేరకు కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ జిల్లాకు చెందిన సంజయ్ కించప్ప, చంద్రప్పలను అరెస్ట్ చేశామని జీఆర్పీ ఎస్సై బాలాజీరావు తెలిపారు. ఆర్పీఎఫ్ ఎస్సై శ్రీధర్ ఆధ్వర్యంలో సిబ్బంది రైల్వేస్టేషన్లో ఆకస్మికంగా తనిఖీ చేస్తుండగా ఈ ఇద్దరూ కనిపించడంతో ప్రశ్నించగా తడబడుతూ సమాధానం చెప్పారని దీంతో వారి వద్ద ఉన్న బ్యాగ్ లను తనిఖీ చేస్తే గుట్టు రట్టయిందన్నారు. ఒడిశాలోని టికిరి నుంచి శివమొగ్గకు గంజాయిని అక్రమంగా తరలిస్తున్నట్లు విచారణలో వెల్లడైందని జీఆర్పీ ఎస్సై బాలాజీ రావు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి విశాఖ రైల్వే కోర్టుకు తరలించామన్నారు.


