రామభద్రపురం: మండలంలోని బూసాయవలసలో సోమవారం తాటిచెట్టు మీద నుంచి పడిపోయిన ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనపై క్షతగాత్రుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన జాగరణ వెంకటేష్ పూసపాటిరేగలోని దివిస్ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాడు.సెలవులకు గ్రామానికి వచ్చి స్నేహితులతో కలిసి తాటికాయలు కొట్టడానికి వెళ్లి తాటిచెట్టు ఎక్కాడు. ప్రమాదవశాత్తు అక్కడి నుంచి జారిపడ్డాడు. దీంతో వెంకటేష్కు కాలు, చేయి విరిగిపోవడంతో తీవ్రగాయాల పాలయ్యాడు. వెంటనే కుటుంబసభ్యులు ప్రథమ చికిత్స నిమిత్తం బాడంగి సీహెచ్సీకి తీసుకువెళ్లి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
లారీ ఢీకొని తీవ్రగాయాలు
తెర్లాం: మోటార్ సైకిల్ను లారీ ఢీకొన్న సంఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తెర్లాం మండలంలోని కూనాయవలస వద్ద సోమవారం రామభద్రపురం నుంచి రాజాం వైపు వస్తున్న లారీ ఓ మోటార్ సైకిల్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో మోటార్ సైకిల్ నడుపుతున్న బాడంగి మండలం వాడాడ గ్రామానికి చెందిన గొట్టాపు శ్రీనివాసరావుకు తలపై, కాలిపైన తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు తెర్లాం 108కు సమాచారం ఇవ్వడంతో వెంటనే వాహనం వచ్చి గాయపడిన వ్యక్తికి ప్రథమ చికిత్స చేసి బాడంగి సీహెచ్సీకి తరలించారు. అక్కడి వైద్యులు చికిత్స చేసి మెరుగైన వైద్య సేవల కోసం విజయనగరం సర్వజన ఆస్పత్రికి రిఫర్ చేశారు. గాయపడిన వ్యక్తి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుపై ఎస్సై సాగర్బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


