విజయనగరం టౌన్: ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను తక్షణమే భర్తీచేయాలని, పరిశ్రమలు స్థాపించాలని, భోగాపురం ఎయిర్ పోర్ట్లో 90శాతం ఉద్యోగాలు స్థానిక యువతకు కేటాయించాలని కలెక్టర్ను కోరుతూ సోమవారం గ్రీవెన్స్సెల్లో జిల్లా బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కులాల ఐక్యవేదిక నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక నాయకులు చోడి ఆదినారాయణ, ఇప్పిలి రామారావు, బూర ఐశ్వర్యలు మాట్లాడుతూ జిల్లాలో పారిశ్రామికీకరణ చేయడానికి ఎమ్ఎస్ఎమ్ఈ పథకాన్ని తీసుకువచ్చి భూసమీకరణ చేశారని, ఆ భూములను అభివృద్ధి చేసి పారిశ్రామికీకరణ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. వ్యవసాయాధారిత పరిశ్రమలైన జీడి, మామిడి, కొబ్బరి, మత్స్య, కల్లు పరిశ్రమలను అభివృద్ధి చేయాలని కోరారు. గుర్ల మండలంలోని కెల్ల గ్రామంలో 1085 ఎకరాలలో రూ.8570 కోట్లతో భారీ స్టీల్ ఫ్యాక్టరీని పెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, వెంటనే స్టీల్ ప్యాక్టరీ నిర్మించాలని కోరారు. కార్యక్రమంలో ఐక్యవేదిక నాయకులు దిమిలి పైడిరాజు, లాయర్ షాజహాన్ తదితరులు పాల్గొన్నారు.


