విజయనగరం గంటస్తంభం: విజయనగరం జిల్లా అటవీశాఖ అధికారిగా (డీఎఫ్ఓ) ఎం.సోమసుందరం అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు డీఎఫ్ఓగా పనిచేసిన రెడ్డి కొండలరావుకు ఐఎఫ్ఎస్ అధికారిగా ఉద్యోగోన్నతి లభించడంతో రాజమండ్రికి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సోమసుందరం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా అటవీ సంరక్షణలో సమర్ధవంతంగా సేవలందిస్తానని తెలిపారు.
టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి
చీపురుపల్లిరూరల్(గరివిడి): రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని వైఎస్సార్సీపీ నాయకులకు శాసనమండలి విపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ సూచించారు. గరివిడిలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో పార్టీ నాయకులతో శనివారం మాట్లాడారు. గ్రామస్థాయి కమిటీల ఏర్పాటుపై ఆరా తీశారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో చంద్రబాబు విఫలమయ్యారని, ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేద్దామన్నారు. కార్యక్రమంలో ఆయన కుమార్తె బొత్స అనూష, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇప్పిలి అనంతం, ప్రచార విభాగం అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాసులనాయుడు, యువజన విభాగం అధ్యక్షుడు బెల్లాన వంశీకృష్ణ, పార్టీ గరివిడి మండలాధ్యక్షుడు మీసాల విశ్వేశ్వరరావు, మాజీ పీఏసీఎస్ అధ్యక్షుడు ఎలకల అప్పలనాయుడు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
● ఎండి‘నది’
వేగావతి నదిలో చుక్కనీరు లేదు. వేసవి ఎండలకు నది పూర్తిగా ఎండిపోయింది. అక్కడక్కడ చిన్నచిన్న నీటిపాయలు, ఊటలే కనిపిస్తున్నాయి. వేసవి తీవ్రత అధికంగా ఉన్నందున నదిలో నీరు ప్రవహించే పరిస్థితి లేదు..పశుపక్ష్యాదులు సైతం దాహార్తి తీర్చుకునేందుకు అవస్థలు పడాల్సిన దుస్థితి నెలకొంది. ఇదే నది బొబ్బిలి, బాడంగి, తెర్లాం మండలాల మీదుగా ప్రవహిస్తుండగా ఇప్పుడు నదిలో నీరు లేకపోవడంతో సాగునీటి కొరత కూడా ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బొబ్బిలి మండలంలోని కునుకువానివలస వద్ద పూర్తిగా ఎండిపోయిన నదిని చిత్రంలో చూడొచ్చు.
– బొబ్బిలి


