బొబ్బిలి: స్థానిక పట్టణంలోని బఫర్ జోన్(కోటి చెరువు, భైరిసాగరం తదితర సాగునీటి వనరుల ప్రాంతం)లో ఉన్న అకమ్ర కట్టడాలను తక్షణమే కూల్చివేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కోట అప్పన్న, పట్టణ అధ్యక్షుడు మునకాల శ్రీనివాసరావులు డిమాండ్ చేశారు. ఇదే విషయమై వారు మండల కేంద్రంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. బొబ్బిలి పట్టణ నలుమూలల ఉన్న ఖాళీస్థలాలు, చెరువు గర్భాలను పలువురు అక్రమార్కులు ఆక్రమించుకుంటుంటే రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. కొంతమంది మున్సిపల్, రెవెన్యూ అధికారుల కనుసన్నల్లోనే ప్రభుత్వ స్థలాల కబ్జా, తప్పుడు ధ్రువపత్రాలతో రిజిస్ట్రేషన్లు వంటివి జరుగుతున్నాయని ఆరోపించారు. ఒకప్పుడు మల్లంపేట, గొల్లపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు–55లో 80 ఎకరాలు, భైరిసాగరం మరో 80 ఎకరాలు ఉండేవన్నారు. ఇప్పుడు వాటిలో సగానికి పైగా స్థలం కబ్జాదారుల చేతిలోకి వెళ్లిపోయిందన్నారు. కబ్జారాయుళ్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, ప్రభుత్వ స్థలాల కబ్జాను ఆపాలని కోరారు.


