గరుగుబిల్లి: మండలంలోని సంతోషపురం గ్రామానికి చెందిన తిమిటి రష్మిత జాతీయ స్థాయిలో ప్రతిభ చాటింది. ఈమె ముంబయిలోని మార్వే బీచ్లో ఈ నెల 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు జరిగిన వైఏఐ యూత్ అండ్ జూనియర్ నేషనల్ చాంపియన్షిప్ – 2026లో అండర్ – 17 విండ్ సర్ఫింగ్ విభాగంలో రజిత పతకం కై వసం చేసుకొంది. పోటీలలో కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటు అద్భుతమైన నౌక నైపుణ్యం, పట్టుదల, సమర్ధవంతమైన రేసింగ్ వ్యూహలను ప్రదర్శించి రష్మిత విజయం సాధించింది. రష్మిత తండ్రి శ్రీకాంత్ చతుర్వేది వృత్తి రీత్యా ఆర్మీలో ఉద్యోగం చేయడంతో ముంబయిలోనే స్థిరపడ్డారు. రష్మిత ప్రస్తుతం 9వ తరగతి చదువుతుంది. ఈమె ప్రతిభపై తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. రష్మిత సాధించిన పతకం జిల్లాకే గర్వకారణమని పలువురు క్రీడాభిమానులు పేర్కొన్నారు.


