పార్వతీపురం: విప్లవ జ్యోతి, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు చిరస్మరణీయుడని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్కుమార్ రెడ్డి కొనియాడారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం అల్లూరి సీతారామరాజు వర్ధంతిని గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. అల్లూరి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్ర ఉద్యమంలో అల్లూరి పోరాటపటిమ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందన్నారు. భరతమాతను బ్రిటిష్ దాస్యశృంఖలాల నుంచి విముక్తి చేసేందుకు ఉద్యమబాట పట్టి, బ్రిటిష్ సైన్యాన్ని గడగడలాడించిన ధైర్యం అల్లూరి సొంతమన్నారు. గిరిజనుల అణచివేతను వ్యతిరేకించిన అల్లూరి, విప్లవ జ్వాలను రగిలించిన మహా పోరాటయోధుడని కొనియాడారు. అల్లూరి చేసిన త్యాగం వెలకట్టలేనిదని, ఆయన ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత, గిరిజన సంక్షేమశాఖ ఉప సంచాలకులు ఎ.విజయశాంతి, డ్వామా పీడీ కె.రామచంద్రరావు, పశుసంవర్థక శాఖాధికారి డా.ఎస్.మన్మథరావు పాల్గొన్నారు.


