● ప్రకాశం బ్యారేజీ నుంచి విద్యాశాఖా
మంత్రి నారాలోకేశ్ ఇంటివరకు
పాదయాత్ర
విజయనగరం గంటస్తంభం:
సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈ నెల 15న మహా పాదయాత్రను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన సమాచార పత్రాన్ని ఏపీ సమగ్ర శిక్షా కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (జేఏసీ) నాయకులు డీఈఓ యు.మాణిక్యంనాయుడుకు గురువారం అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ, ఎన్నికల ముందు సమగ్రశిక్ష ఉద్యోగులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల రెగ్యులరైజేషన్, హెచ్ఆర్ పాలసీ అమలు, సమాన పనికి సమాన వేతనం, మినిమం టైమ్స్కేల్, ఈపీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ, మెడికల్ లీవులు, మహిళలకు చైల్డ్కేర్ లీవులు, తదితర సమస్యలను తక్షణమే పరిష్కరిచాలని కోరారు. ఈ నెల 15న ప్రకాశం బ్యారేజ్ నుంచి విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నివాసం వరకు కుటుంబ సభ్యులతో కలిసి నిర్వహించనున్న మహా పాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర చైర్మన్ బి.కాంతారావు, నాని, జిల్లా చైర్మన్ ఆర్.శ్రీనివాసరావు, ఎంఐఎస్ కోఆర్డినేటర్ కృష్ణంనాయుడు, మండల అకౌంటెంట్ రామకృష్ణ, సీఆర్ఎంటీ నాయకులు ఎం.అప్పలనాయుడు, అప్పలనాయు డు, పైడిరాజు, వేణుగోపాల్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


