
గురూ.. నాకు చెప్పకుండా పింఛన్లు ఇచ్చేస్తావా?
సాక్షి, పార్వతీపురం మన్యం: ‘గురూ... నేను చెప్పింది విను... మా మేడం గారు తెచ్చిన పెన్షన్లవి. టీడీపీలో ఉన్న ప్రతి కార్యకర్త కష్టం అవి.. నీలాంటి, నాలాంటి వ్యక్తులు పెన్షన్ పంపిణీకి వచ్చేటప్పుడు, ఇక్కడ టీడీపీ నాయకులు ఎవరు? వాళ్ల పేరు ఏంటి ? తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా?..’ అంటూ ఓ టీడీపీ నాయకుడు సచివాలయ సిబ్బందిపై రుబాబు చేసిన ఘటన మక్కువ మండలంలో చోటుచేసుకుంది. కొయ్యానపేట గ్రామానికి చెందిన ఇద్దరు లబ్ధిదారులకు నూతన పింఛన్లు మంజూరయ్యాయి. ఈ రెండు పింఛన్ల పంపిణీకి శుక్రవారం వైఎస్సార్సీపీ సర్పంచ్ పోల ఉమామహేశ్వరి, టీడీపీ నాయకుడు కొయ్యాన కాశీవిశ్వనాథంను సచివాలయ సిబ్బంది ఆహ్వానించారు. ఫిషరీస్ అసిస్టెంట్, సర్వే అసిస్టెంట్లు.. ప్రజా ప్రతినిధుల చేతులు మీదుగా పింఛను అందించారు. అంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. అదే గ్రామానికి చెందిన మరో టీడీపీ నాయకుడు ఫిషరీస్ అసిస్టెంట్ కు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడటం గమనార్హం. ‘నీవు ఎవరికి చెప్పావు. నాకు కరెక్ట్ గా చెప్పు... నాకు ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే... మేడం గారు టీడీపీ కార్యకర్తలు వెళ్లి, మనం ఇచ్చిన పెన్షన్లు మన ఆధ్వర్యంలో పంచాలంటూ కచ్చితంగా చెప్పారు. మీరు కొయ్యాన్నపేట గ్రామానికి వచ్చిన వెంటనే గ్రామంలో టీడీపీ నాయకులు ఎవరు? అనే వివరాలు మీ అధికారుల నుంచి తీసుకోవాలి.. అలా తీసుకున్నారా? అంటూ అని గదమాయించాడు. దీనికి సచివాలయ ఉద్యోగి బదులిస్తూ.. సెక్రటరీ ఆదేశాల మేరకు సర్పంచ్ ఉమామహేశ్వరి, టీడీపీ నాయకులు కాశీ విశ్వనాథానికి సమాచారం ఇచ్చామన్నారు. తాను వచ్చి నాలుగు రోజులే అయ్యిందని.. సెక్రటరీ, వెల్ఫేర్ అసిస్టెంట్ అంటూ సచివాలయ ఉద్యోగి సమాధానం ఇస్తుండగా.. ‘అవన్నీ మాకు అవసరం లేదు గురు.. నేను చెప్పింది విను.. మా మేడం గారు తెచ్చిన పెన్షన్లవి. కాశీ నాయుడు టీడీపీ నాయకుడని చెప్పి, వైఎస్సార్సీపీ నాయకుల్ని పిలిపించి పింఛన్లు అందివ్వడంలో ఆంతర్యం ఏంటి? కొయ్యాన కాశీనాయుడుకి ఫోన్ చేయడం రైట్, ఆయన ఆ ఇద్దరినీ పిలిపించమని, పెన్షన్ ఇప్పించమన్నాడు రైట్.. అంతే కదా.. ఓకే బాయ్... తర్వాత మాట్లాడదాం’ అంటూ సచివాలయ ఉద్యోగిపై ఆక్రోశం వెళ్లగక్కాడు. పింఛన్లు పంపిణీకి నన్ను పిలవలేదు, నన్ను పిలవలేదంటూ మమ్మల్ని వేధిస్తున్నారే తప్ప.. ఎండలో కష్టపడి పింఛన్లు పంపిణీ కార్యక్రమం చేసినప్పటికీ కనీసం మంచినీళ్లు అందించే నాథుడు కరవవుతున్నారంటూ పలువురు సచివాలయ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మక్కువ మండలంలో సచివాలయ సిబ్బందిపై తమ్ముడి రుబాబు
అంతా వారిష్టం..
పార్వతీపురం రూరల్: ప్రభుత్వ నిబంధనల ప్రకారం లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్ డబ్బులు అందజేయాలి. అయితే, పార్వతీపురం మన్యం జిల్లా చినబొండపల్లి గ్రామంలో ఓ టీడీపీ నాయకుని ఇంటివద్దకే పింఛన్దారులందరినీ పిలిపించి పింఛన్ డబ్బులను సచివాలయ సిబ్బందితో శుక్రవారం పంపిణీ చేయడం విమర్శలకు తావిచ్చింది. అధికారులు, సచివాలయ సిబ్బంది తీరును సర్పంచ్ గండి శంకరరావు, వైస్ ఎంపీపీ బంకురు రవికుమార్ తప్పుబట్టారు. గత ప్రభుత్వం ఎలాంటి రాజకీయ ప్రమేయం లేకుండా లబ్ధిదారుల ఇంటివద్దనే వలంటీర్లతో పింఛన్లు పంపిణీ చేయగా, నేడు కూటమి ప్రభుత్వం ప్రజాధనంతో ఇచ్చే పింఛన్లను తమ నాయకుల మోచేతిపై అందించేందుకు పూనుకోవడం దారుణమన్నారు.
స్థానికంగా ఉన్న చైర్పర్సన్, ఎంపీపీ, వైస్ ఎంపీపీ, సర్పంచ్.. ఇలా ప్రజలచే ఎన్నుకోబడిన ఏ ఒక్క నాయకుడికి గౌరవం ఇవ్వకుండా పచ్చకండువాయే పరమావధిగా భావించి టీడీపీ కార్యకర్తలను వెంట బెట్టుకొని పింఛన్లు పంపిణీ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్వతీపురం మండలం సూడిగాం గ్రామంలో ఎంపీపీ మజ్జి శోభారాణిని కాదని స్థానిక టీడీపీ కార్యకర్తలు పింఛన్లు పంపిణీ చేయడంపై గ్రామస్తులు భగ్గుమన్నారు. పార్వతీపురం మున్సిపాలిటీలోనూ ఇదే పరిస్థితి.

గురూ.. నాకు చెప్పకుండా పింఛన్లు ఇచ్చేస్తావా?