
కొడుకును బడిలో చేర్చడానికి వచ్చి తండ్రి మృతి
పాచిపెంట: కొడుకును పాఠశాలలో చేర్పించడానికి వచ్చిన ఓ తండ్రి అకస్మాత్తుగా మృతి చెందిన సంఘటన పాచిపెంట మండల కేంద్రంలో సోమవారం విషాదం నింపింది. ఈ ఘటనపై వైద్యాధికారి, గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని రాయిగుడ్డి వలస గ్రామానికి చెందిన చెదల కన్నయ్య కుమారుడు గౌతం మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో నాలుగవ తరగతి చదువుతున్నాడు. అయితే పి.కోనవలస రెసిడెన్షియల్ పాఠశాలలో 5వ తరగతికి సీటు రావడంతో సోమవారం ఉదయం రికార్డ్షీట్ తీసుకుని పి.కోనవలస రెసిడెన్షియల్ పాఠశాలలో జాయిన్ చేసేందుకు పాచిపెంట గిరిజన ఆశ్రమ పాఠశాలకు వచ్చాడు. పాఠశాలకు వచ్చిన కొద్దిసేపటికే ఫిట్స్ రావడంతో కింద పడిపోయాడు. వెంటనే పాఠశాల సిబ్బంది, స్థానికులు పాచిపెంట పీహెచ్సీకి హుటాహుటిన తరలించారు. వైద్యాధికారి వెంకటరమణ పరిశీలించి అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు.