
చంద్రబాబు అంటే మోసం
జగన్ అంటే నమ్మకం...
చీపురుపల్లి: కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో కేసులు, మోసాలు, అవినీతి, అబద్ధాలు, దాడులు, దోపీడీలు తప్ప.. ప్రజలకు చేకూరిన లబ్ధి ఏదీ లేదని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీచైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది మోసాలు, అప్రజాస్వామిక పరిపాలనపై వైఎస్సార్సీపీ అధిష్టానం ముద్రించిన ‘జగన్ అంటే నమ్మకం.. చంద్రబాబు అంటే మోసం’ అనే పుస్తకాలను సోమవారం సాయంత్రం చీపురుపల్లి వైఎస్సార్సీపీ కార్యాలయంలో మాజీ ఎంపీ, రాష్ట్ర పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ మెంబర్ బెల్లాన చంద్రశేఖర్తో కలిసి ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024 జూన్ 12 నుంచి 2025 జూన్ 12 వరకు కూటమి ప్రభుత్వ పరిపాలన, 2019 జూన్ నుంచి 2020 జూన్ వరకు వైఎస్సార్సీపీ పరిపాలనలో సంక్షేమ పథకాలు అమలు, అభివృద్ధి సంస్కరణలు బేరీజు వేస్తూ పుస్తకాన్ని ముద్రించడం జరిగిందన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో మేనిఫెస్టోలోని అంశాలన్నీ అమలు చేసి ఏడాదిలోనే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన సంగతిని గుర్తుచేశారు.
నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని నిరుద్యోగ యువతను మోసం చేశారని, 20 లక్షలు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టారని అన్నారు.
ఏడాది కూటమి పరిపాలనలో పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్లకు రావాల్సిన జనరల్ ఫండ్స్ ఒక్క రూపాయి కూడా జమ కాలేదన్నారు. అలాగే 15వ ఆర్థిక సంఘం నిధులు కూడా రాలేదన్నారు. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు లేఖ రాసినా సమాధానం రాలేదన్నారు. పంచాయతీలు నిర్వీర్యం అయిపోతున్నాయని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.