
ఇరువర్గాల కొట్లాట
జియ్యమ్మ వలస రూరల్: మండలంలోని తురకనాయుడు వలస గ్రామంలో హరిజనులు, ఎరగ్రొల్లల మధ్య కొట్లాట జరిగింది. జియ్యమ్మవలస పోలీసులు అందించిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఆదివారం హరిజనవాడలో ఓ శుభకార్యం జరగడంతో సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో కార్యక్రమం ముగిసిన తరువాత అద్దె సామగ్రిని వ్యాన్పైకి ఎక్కిస్తున్న సమయంలో ఆ మార్గం గుండా ఎర్రగొల్లలకు చెందిన గొర్లి రాజు, గొర్లి చందులు స్కూటీపై వెళ్తూ దారికి అడ్డంగా ఉన్న సామగ్రిని తొలగించమని చెప్పగా, అక్కడే ఉన్న ఎత్తుల హరి కొద్ది నిమిషాలు ఓపిక పట్టమని చెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి కొట్లాటకు దిగారు. ఈ కొట్లాట హరిజన పేటలో హరిజనులు, ఎర్ర గొల్లల మధ్య తీవ్ర స్థాయిలో జరిగింది. కొట్లాటలో పలువురికి గాయాలు కాగా ఇరువర్గాలు పోలీసులను ఆశ్రయించాయి. ఎర్రగొల్లలు దౌర్జన్యానికి దిగుతూ తమపై కుల దూషణ చేశారంటూ హరిజనులు కేసు పెట్టగా, గొర్లి రాజు గొర్లి చందు, లక్ష్మి, గొర్లి మజ్జి, గొర్ల పాపారావులపై జియ్యమ్మవలస పోలీసులు అట్రాసిటి కేసు నమోదు చేశారు. దీంతో పాలకొండ డీఎస్పీ ఎం.రాంబాబు, చినమేరంగి సర్కిల్ ఇన్స్పెక్టర్ టీవీ తిరుపతిరావు సిబ్బందితో తురక నాయుడు వలస గ్రామంలో విచారణ చేపట్టారు. బాధ్యులపై తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించి ఇరువర్గాలను సమన్వయ పరిచారు. కార్యక్రమంలో జియ్యమ్మ వలస ఏఎస్సై ప్రశాంత్ కుమార్, చినమేరంగి ఎస్సై పి.అనీషలు పాల్గొన్నారు.