
సచివాలయ ఉద్యోగులకుస్థానచలనం..!
పార్వతీపురంటౌన్: గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఒక్కసారిగా ఆ ఉద్యోగ వర్గాల్లో టెన్షన్ మొదలైంది. ప్రధానంగా ఒకేచోట ఐదేళ్లు పనిచేసిన ప్రతి ఒక్కరూ బదిలీ కావాల్సిందేనన్న నిబంధనతో పాటు పలురకాల వైకల్యం, స్పౌజ్, రిక్వెస్ట్ కింద బదిలీ చేసే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో పార్వతీపురం మన్యం జిల్లాలో గల 2,350 మంది సచివాలయ ఉద్యోగుల్లో బదిలీ టెన్షన్ నెలకొంది. ఉద్యోగుల్లో కొందరు తమకు నచ్చిన స్థానాలకు తమదైన శైలిలో ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఏదిఏమైనా పలు శాఖల తరువాత సచివాలయ ఉద్యోగులకు సైతం బదిలీ ఉత్తర్వులు రావడంతో ఆ వర్గాల్లో ఉత్కంఠ రేగుతోంది.
కలెక్టర్ల అనుమతితో కౌన్సెలింగ్
ఉమ్మడి విజయనగరం జిల్లాలో పని చేస్తున్న గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులందరినీ కలిపి బదిలీ చేయలని ప్రభుత్వం షరతు విధించింది. ఉమ్మడి జిల్లా కలెక్టర్ల అనుమతితో త్వరలో బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించ న్నారు. వీటితో పాటూ ఆయా శాఖల సమన్వయంతో కౌన్సెలింగ్ జరగనుంది. జిల్లా వ్యాప్తంగా 60 శాతం మంది ఉద్యోగులకు బదిలీ అయ్యే అవకాశం ఉందని ఆ శాఖ వర్గాల నుంచి తెలుస్తోంది.
గతంలో పారదర్శకంగా బదిలీలు
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 2023లో జరిగిన బదిలీ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించారు. ఎటువంటి వైరవీలకు తావు లేకుండా బదిలీ ప్రక్రియ సాగింది. ఉద్యోగులందరికీ న్యాయం చేసేవిధంగా బదిలీలు నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన తరువాత బదిలీలకు చర్యలు చేపట్టడంతో తమకు ఎక్కడికి బదిలీ అవకాశం రానుందోనని ఉద్యోగుల్లో టెన్షన్ నెలకొంది. ఈ బదిలీల్లో ప్రధానంగా ఆయా గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులంతా సొంత మండల పరిధిలో ఉండేందుకు అవకాశం లేకుండా నిబంధనలు పెట్టారు. ఒక్కమాటలో చెప్పాలంటే సోంత మండలానికి బదిలీకి నో చాన్స్ అని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. గతంలో పని చేసిన వారందరికీ ఈ నిబంధన వర్తించనుండడంతో ఆందోళనలో ఉన్నారు.
ఈ నెలాఖరుకు పూర్తి చేసే అవకాశం
బదిలీ ఉత్తర్వుల ప్రకారం ఈ నెలాఖరుకు ప్రక్రియపూర్తి చేసే అవకాశం ఉంది. ఒకే చోట ఐదేళ్లు దాటిన ఉద్యోగులతో పాటు వైకల్యం ఉన్నవారు, స్పౌజ్ కేటగిరీ కింద ఉన్న ఉద్యోగులు, రిక్వెస్ట్ ఉద్యోగులందరూ తమ సమగ్ర వివరాలను ప్రభుత్వం త్వరలో అందించే హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్లో నమోదు చేసుకోవాల్సి ఉంది. బదిలీల కౌన్సెలింగ్ మాత్రం ఉమ్మడి జిల్లాకు కలిపే ఉండనుంది. అన్నీ సక్రమంగా జరిగితే ఈ నెలాఖరుకు ప్రక్రియ పూర్తికానుంది.
సిఫార్సుల కోసం పరుగులు
తమ నివాస ప్రాంతాలకు దగ్గరలో విధులు నిర్వహించే విధంగా సిఫార్సుల కోసం ఎమ్మెల్యేల చుట్టూ ఉద్యోగులు పరుగులు తీస్తున్నారు. తమకు కావాల్సిన ప్రాంతాల్లో పోస్టింగ్ల కోసం ఆయా ప్రాంతాల ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రుల వద్ద సిఫార్సుల కోసం చక్కర్లు కొడుతున్నారు. తాజా బదిలీల్లో తమకు అన్యాయం జరగకుండా జాగ్రత్తలు పడుతున్నట్లు ఆ శాఖ వర్గాల నుంచి తెలుస్తోంది.
బదిలీలకు ఉత్తర్వులు విడుదల
సచివాలయ ఉద్యోగుల బదీలలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐదేళ్లు ఒకే సచివాలయంలో పనిచేసిన వారికి బదిలీ తప్పనిసరి అని స్పష్టంగా పేర్కొంది. ఉత్తర్వుల్లో పేర్కొన్న నియమాలకు అనుగుణంగా బదిలీల ప్రక్రియ చేపట్టనున్నాం.
రామచంద్రరావు,
జీఎస్డబ్ల్యూఎస్ జిల్లా అధికారి,
పార్వతీపురం మన్యం
స్పౌజ్, వైకల్యం, రిక్వెస్ట్లపై కార్యాచరణ
ఒకే చోట ఐదేళ్లు దాటిన వారికి బదిలీ తప్పనిసరి
సిఫార్సుల కోసం ఎమ్మెల్యేల చుట్టూ ఉద్యోగుల పరుగులు

సచివాలయ ఉద్యోగులకుస్థానచలనం..!