
రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం..
● మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర
● జగన్ అంటే నమ్మకం.. చంద్రబాబు
అంటే మోసం.. పుస్తకాన్ని ఆవిష్కరించిన మాజీ మంత్రి
సాలూరు: రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర అన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించి 99 శాతం హామీలను అమలు చేస్తే.. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీల అమలులో విఫలమవుతున్నారని ఆరోపించారు. ‘జగన్ అంటే నమ్మకం – చంద్రబాబు అంటే మోసం’ అనే పుస్తకాన్ని పట్టణంలోని తన స్వగృహంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజన్నదొర మాట్లాడుతూ.. 2019 – 20 మధ్య జగన్మోహన్ రెడ్డి నాడు ముఖ్యమంత్రిగా చేసిన పాలనా వివరాలు.. నేడు 2024 – 25 ఏడాది కాలంలో నేటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన పాలనా వివరాలను పుస్తకంలో వివరించడం జరిగిందన్నారు.రెడ్బుక్ రాజ్యాంగం పేరిట రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. బాలికలు, మహిళలపై వేధింపులు, అత్యాచారాలు అధికమవుతున్నాయన్నారు. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు ఒక్కొక్కరిపై 20కి పైగా కేసులు నమోదు చేశారంటే పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని తెలిపారు. వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తుందనే అక్కసుతో సాక్షి మీడియాపై ఇటీవల దాడులు చేయించిన ఘనత చంద్రబాబు,లోకేష్కే దక్కుతుందని ఆరోపించారు.
అమ్మకు మోసం కాదా..?
గత ప్రభుత్వంలో ప్రతి తల్లికీ అమ్మఒడి ఇస్తామని హామీ ఇచ్చి శతశాతం నెరవేర్చిన ఘనత జగన్ మోహన్రెడ్డికి దక్కుతుందని రాజన్నదొర అన్నారు. ఆనాడు పథకం అమలులో నిబంధనలు ఎక్కువగా పెట్టారని గగ్గోలు పెట్టిన టీడీపీ నాయకులు నేడు నిబంధనలు పెట్టలేదా అని ప్రశ్నించారు. తల్లికి వందనంలో రెండు వేల రుపాయలు లోకేష్ ఖాతాలోకి వెళ్లాయని పలువురు వైఎస్సార్సీపీ నేతలు విమర్శించడాన్ని టీడీపీ నాయకులు తప్పు బడుతున్నారని, మరి ఆ టీడీపీ నాయకులే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రెండు వేల రూపాయలు జగన్ ప్యాలెస్కు వెళ్లిపోయాయని విమర్శించలేదా అని ప్రశ్నించారు.
150 పథకాలు అమలు చేయాల్సిందే..
సూపర్ 6తో పాటు 2014 – 19 మధ్య తమ పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలతో పాటు జగన్ మోహన్రెడ్డి హయాంలో అమలైన పథకాలను కూడా తాము అమలు చేస్తామని టీడీపీ నాయకులు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని మాజీ మంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. ఈ లెక్కన సుమారు 150 సంక్షేమ పథకాలు అమలు చేయాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.