
బహిరంగ ప్రదేశాల్లో మందు తాగితే చర్యలు
విజయనగరం క్రైమ్: బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే చర్యలు తప్పవని ఎస్పీ వకుల్జిందల్ హెచ్చరించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ప్రజాశాంతికి భంగం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా దాడులు చేపడుతూ మద్యంబాబులను అరెస్ట్ చేశామన్నారు. నగర శివార్లతో పాటు జిల్లా వ్యాప్తంగా డ్రోన్స్ ద్వారా తనిఖీలు చేపడుతున్నామని చెప్పారు. మందుబాబులతో పాటు వాహన తనిఖీలు, రహదారి భద్రతా నియమాలను ఉల్లఘించిన వారిని గుర్తించి ఈ చలాన్ విధిస్తున్నట్లు తెలిపారు. గడిచిన ఐదు నెలల్లో 2,178 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతున్న 9,095 మందిపై కేసు నమోదు చేశామన్నారు. పోలీసులకు పట్టుబడిన వారికి ముందుగా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని.. రెండోసారి పట్టుబడితే కేసులు తప్పవని.. మూడోసారి కూడా పట్టుబడితే అరెస్టు ఖాయమని హెచ్చరించారు.
ఎస్పీ వకుల్ జిందల్