
జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటాలి
విజయనగరం: ఆత్మరక్షణ క్రీడ తైక్వాండోలో విజయనగరం జిల్లా క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో రాణించి సత్తా చాటాలని జిల్లా తైక్వాండో అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు గురాన అయ్యలు, సిహెచ్.వేణుగోపాలరావు ఆకాంక్షించారు. ఈ నెల 9, 10, 11 తేదీల్లో అనంతపూర్ జిల్లా తాడిపత్రిలో జరిగిన సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో జరిగిన పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు మొత్తంగా 33 పతకాలు కై వసం చేసుకుని ఓవరాల్ చాంపియన్షిప్లో తృతీయ స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ పోటీల్లో జిల్లా క్రీడాకారులు 19 బంగారు పతకాలు, 6 వెండి పతకాలు, 8 కాంస్య పతకాలు చేజిక్కించుకుని విద్యలనగరం విజయనగరం జిల్లా కీర్తి ప్రతిష్టలను చాటి చెప్పారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జిల్లా తైక్వాండో అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు అయ్యలు, వేణుగోపాలరావులు అభినందించారు. జిల్లా క్రీడాకారులు భవిష్యత్లో జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో రాణించి ఉజ్వల భవిష్యత్కు బాటలు వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
జిల్లా తైక్వాండో అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు