
బడుగులపై కూలిన గోడ..!
● ఇద్దరి దుర్మరణం ● మృతుల్లో ఒకరు మూగవారు ● మిద్దె ఇల్లు మట్టి తవ్వుతుండగా ప్రమాదం
గంట్యాడ:
పేదల కుటుంబాల్లో పెను విషాదం సంభచించింది. ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో కుటుంబసభ్యులు తీవ్రంగా రోదిస్తున్నారు. పేద కుటుంబాలకు పెద్ద కష్టం రావడంతో గ్రామమంతా అయ్యో పాపం అంటోంది. 25 ఏళ్లకు పైబడి కూలి పనులకు వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు అ కూలి పనికి వెళ్లే మృత్యువాత పడ్డారు. వయసు మీద పడినా కుటుంబ పోషణ కోసం కూలిపనులకు వెళ్లడం వారికి తప్పలేదు. రోజూ మాదిరిగా ఆదివారం కూలి పనికి వెళ్లారు. అదే వారికి చివరి పని అవుతుందని భావించలేదు. పనిచేస్తుండగా గోడ మీదపడడంతో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ హృదయ విదారక సంఘటన గంట్యాడ మండలంలోని రామవరం గ్రామంలో జరిగింది. ఈ ఘటనపై పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రామవరం గ్రామానికి చెందిన రీసు సత్యవతికి మిద్దె ఇల్లు ఉంది. ఆ ఇంటిని తొలగించి అందులో పశువులశాల కట్టేందుకు మిద్దె ఇంటిని కూల్చే పనులు చేపట్టారు. దీంతో ఆ పని చేసేందుకు అదే గ్రామానికి చెందిన ఎర్ర చిన్నయ్య(61), మూగవ్యక్తి కొలుసు పైడితల్లి (49) వెళ్తున్నారు. శనివారం చాలావరకు మట్టిని తవ్వి తరలించారు. ఆదివారం ఉదయం 8:30 గంటల సమయంలో మిద్దె ఇంటి గోడను గునపంతో తవ్వుతుండగా ఒక్కసారిగా గోడ కూలి ఇద్దరు కూలీలపై పడిపోయింది. గోడ కింద వారిద్దరూ ఉండిపోవడంతో ఊపిరాడక అక్కడికక్కడే మరణించారు. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వచ్చి మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం విజయనగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై డి.సాయికృష్ణ తెలిపారు. మృతుడు చిన్నయ్యకు భార్య సత్యవతి, ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. పైడితల్లికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
దూరమైన పెద్దదిక్కు
మృతుడు చిన్నయ్యకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పిల్లలు ముగ్గురికి వివాహాలయ్యాయి. చిన్నయ్య భార్యతో పాటు చిన్న కొడుకు దగ్గర ఉంటున్నాడు. కల్లు గీత సమయంలో కల్లుగీస్తుంటాడు. కల్లుగీత అయిపోయిన తర్వాత కూలి పనులకు వెళ్తారు. కూలిపనులు చేస్తూ వచ్చే ఆదాయం ద్వారా కుమార్తెకు, కుమారులకు పెళ్లిళ్లు చేశాడు. అందరినీ అల్లారు ముద్దుగా పెంచి అందరి యోగ క్షేమాలు చూసిన ఇంటి పెద్ద దిక్కు, తండ్రి అకస్మాత్తుగా మరణించడంతో పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
మూగవాడైనా కాయకష్టంతో పోషించాడు
కొలుసు పైడి తల్లి మూగవాడు అయినప్పటికీ తన కాయ కష్టంతోనే కుటుంబాన్ని పోషించాడు. తన ఇద్దరు కుమార్తెలకు వివాహం చేశాడు. ప్రస్తుతం భార్యతో కలిసి ఉంటున్నాడు. పైడితల్లి మృతి చెందడంతో ఇప్పడు ఏవిధంగా బతకాలంటూ భార్య రోదిస్తోంది. తండ్రి ఆకస్మిక మృతితో కుమార్తెలు గుండెలవిసేలా బావురుమంటున్నారు.

బడుగులపై కూలిన గోడ..!

బడుగులపై కూలిన గోడ..!