
నేడు ప్రజాసమస్యల పరిష్కార వేదిక
సీతంపేట: ప్రజాసమస్యల పరిష్కార వేదిక సోమవారం జరగనుందని ఐటీడీఏ అధికార వర్గాలు తెలిపాయి. గిరిజనులు తమ సమస్యలపై వినతులు సమర్పించవచ్చని పిలుపునిచ్చారు.
సాలూరులో..
పార్వతీపురంటౌన్: సాలూరు మున్సిపల్ కార్యాలయంలో ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టరు ఎ.శ్యామ్ప్రసాద్ ఓ ప్రకటనలో ఆదివారం తెలిపారు. ఉదయం 10 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో ప్రజాసమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. జిల్లా స్థాయి అధికారులంతా ఈ కార్యక్రమానికి రావాలని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
రూ.10కి పడిపోయిన పైనాపిల్
సీతంపేట: స్థానిక మార్కెట్లో ఆదివారం పైనాపిల్ను ఒక్కొక్కటి రూ.10కి విక్రయిస్తున్నారు. గడిచిన వారం రూ.15 పలికిన ధర ఒక్కసారిగా రూ.10కి పడిపోవడంతో గిరిజన రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికంగా పైనాపిల్ దిగుబడి పెరగడం, మార్కెట్కు ఎక్కువగా తీసుకురావడంతో ధర పడిపోయినట్లు గిరిజనులు చెబుతున్నారు.
ఉత్తమ ప్రతిభతో
గుర్తింపు తీసుకురావాలి
● డీఆర్ఓ హేమలత
పార్వతీపురంటౌన్: యోగాంధ్ర రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనేందుకు జిల్లా విజేతలకు ఏర్పాటు చేసిన బస్సు ఆదివారం కలెక్టరేట్ నుంచి బయల్దేరింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత పర్యవేక్షించారు. కార్యక్రమానికి నియమించిన అధికారులు, సిబ్బందికి ఈ సందర్భంగా ఆమె తగు సూచనలు చేశారు. జిల్లా విజేతలు, కేర్టేకర్స్, సిబ్బందికి మౌలిక సదుపాయాల ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాలుగు రోజుల పాటు జిల్లా కేంద్రంలో నిర్వహించిన యోగాంధ్ర పోటీల్లో విజేతలను 16,17 తేదీల్లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనేందుకు నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం ఎన్టీఆర్ జిల్లాకు పంపిస్తున్నట్లు చెప్పారు. యోగాంధ్ర జిల్లా కన్వీనర్ డా. జగన్మోహన్రావు మాట్లాడుతూ జిల్లా నుంచి 32 మంది విజేతలు రాష్ట్ర స్థాయిలో పాల్గొంటున్నారని, వారంతా సోలో, గ్రూప్ యోగాసనాలు, సాంగ్, క్విజ్, పెయింటింగ్ స్కిట్, ఎస్సే, పోస్టర్, షార్ట్ఫిల్మ్ ఇలా 11 కేటగిరీల్లో నిర్వహించిన పోటీల్లో గెలుపొందినవారన్నారు. కార్యక్రమంలో పీఓ, ఆర్బీఎస్కే డా. టి.జగన్మోహన్రావు, ఏఓ సీహెచ్. రాధాకృష్ణ, డీటీ పి.లక్ష్మీకుమార్, తదితరులు పాల్గొన్నారు.
మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలి
● ఏపీ ఎస్టీ కమిషన్చైర్మన్ డీవీజీ శంకరరావు
సాలూరు రూరల్: ప్రభుత్వం మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలని ఏపీ ఎస్టీ కమిషన్ చైర్మన్ డీవీజీ శంకరరావు అన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన సాలూరు మండలంలోని జీగిరాం గ్రామానికి చెందిన అలేఖ్య ఎంటర్ప్రైజస్ పసుపు ప్రాసెసింగ్ యూనిట్ అధినేత అల్లాడ సునీతకు ఉత్తమ మహిళ పారిశ్రామిక వేత్తగా ఫాప్సి అవార్డు వచ్చిన సందర్భంగా ఆమెను అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ప్రాంతంలో పసుపు ప్రాసెసింగ్ యూనిట్ స్థాపించి ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని విజయవంతంగా నడిపిస్తున్న సునీతకు అవార్డు రావడం అభినందనీయమన్నారు.

నేడు ప్రజాసమస్యల పరిష్కార వేదిక

నేడు ప్రజాసమస్యల పరిష్కార వేదిక