
అర్హులందరికీ తల్లికి వందనం ఇవ్వకుంటే న్యాయ పోరాటం
రేగిడి: కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు సంబంధించి తల్లికి వందనం పథకం అర్హులైన వారందరికీ అందేలా చూడాలని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, రాజాం నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ తలే రాజేష్ డిమాండ్ చేశారు. అర్హులైన లబ్ధిదారులకు ఈ పథకం అందకపోతే న్యాయ పోరాటం చేసైనా ఈ పథకం అందే విధంగా చూస్తామని పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా అమలు చేయడం లేదని అన్నారు. విద్యాశాఖ దగ్గర ఉన్న సమాచారం మేరకు సుమారు 88లక్షల మంది విద్యార్థులు ఉండగా 55 లక్షల మంది విద్యార్థులకు మాత్రమే ఈ పథకం అందించారని వివరించారు. ప్రతి ఒక్క విద్యార్థికి రూ.15వేలు అందజేస్తామని హామీ ఇవ్వగా ఇప్పుడు వారి ఖాతాల్లో రూ.13వేలు మాత్రమే జమ అవుతుందని అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అమ్మ ఒడి పథకం కింద రూ.15వేలు మంజూరు చేసి పాఠశాల నిర్వహణ ఖర్చుల కోసం రూ.2వేలు తగ్గించి రూ.13వేలు అందిస్తే ఇప్పటి విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్నది ఏమిటని ప్రశ్నించారు. ఏ కుటుంబంలో అయినా ఒకరికి ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వర్తిస్తే ఆ కుటుంబంలో విద్యార్థులకు తల్లికి వందనం అమలు చేయకపోవడం దారుణమన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇటువంటి నిబంధనలు పెట్టకుండా అందిరికీ అమ్మ ఒడి అందజేశామని వివరించారు. అర్హులై ఉన్నప్పటికీ వైఎస్సార్సీపీ సానుభూతి పరులకు ఈ పథకానికి ఎంపిక చేయకుండా టీడీపీ సానుభూతి పరులు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని, రాజకీయ ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గకుండా పని చేయాలని అన్నారు. లేకుంటే న్యాయ పోరాటం చేస్తామన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షులు టంకాల అచ్చెన్నాయుడు, మండల పార్టీ అధ్యక్షులు వావిలపల్లి జగన్మోహనరావు, రాజాం నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు కరణం శ్రీనివాసరావు, డాక్టర్ బి.నరేంద్ర పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్