
పేదల ఇళ్ల స్థలాల కోసం ఆందోళన
విజయనగరం టౌన్: పేదలకు ఇళ్లస్థలాలు మంజూరు చేయాలని పట్టణ బడుగు, బలహీన వర్గాల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రెడ్డి నారాయణరావు, చెన్నా ధర్మ ప్రభుత్వాన్ని కోరారు. ఇదే విషయమై స్థానిక ధర్మపురి ప్రాంతంలో శనివారం నిరసన చేపట్టారు. వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కూటమి నాయకులు పేదలకు హామీల వర్షం కురిపించారని, అర్బన్ ఏరియాలోని పేదలకు రెండు సెంట్లు, రూరల్ ఏరియాలోని పేదలకు మూడు సెంట్లు స్థలంతో పాటు నిర్మాణానికి రూ.5 లక్షలు అందిస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి ఇళ్లు మంజూరు చేయలేదని, కొత్త వారికి ఎప్పుడిస్తారో కూడా స్పష్టత లేదన్నారు. తక్షణమే ఇళ్లస్థలాలు మంజూరు చేయాలని లేకపోతే భవిష్యత్లో పోరాటం చేస్తామన్నారు. ఈ నెల 16న తహసీల్దారు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో నీలాపు అప్పలరాజు రెడ్డి, గంటా సీతమ్మ, గిడిజాల రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.