
సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త..!
● కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్
పార్వతీపురంటౌన్: సైబర్ నేరగాళ్లు పెట్టే ప్రలోభాలకు గురికావద్దని, వారు చేసే వివిధ మోసాలకు దూరంగా ఉండాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అపరిచితుల నుంచి వచ్చే మొబైల్ నంబర్లకు బదులివ్వవద్దని, డిజిటల్ అరెస్టులు లాంటివి లేవని కలెక్టర్ తేల్చిచెప్పారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. డిజిటల్ అరెస్ట్ అని ఎవరైనా చెప్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. మొబైల్లో ఎలాంటి బెట్టింగ్ యాప్లను డౌన్లోడ్ చేసుకోవద్దని, వాటిని సోషల్ మీడియా ద్వారా ఇతరులకు షేర్ చేయొద్దన్నారు. అలా చేసి ఇబ్బందులు, లేనిపోని సమస్యలను కొనితెచ్చుకోవద్దని కలెక్టర్ హితవు పలికారు. బెట్టింగ్ యాప్లు ఉపయోగించినా, ఇతరులకు ప్రమోట్ చేసినా చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. మీరు లాటరీ గెలిచారు. మీకు పాస్వర్డ్ వస్తుంది. లేదా మీ మొబైల్కు వచ్చే పిన్ నంబర్ చెప్పండంటూ సైబర్ నేరగాళ్లు మోసం చేసే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతాల వివరాలు, ఓటీపీ వివరాలు ఎవరికి తెలియజేయవద్దని సూచించారు. స్క్రాచ్ చేయండి. రివార్డు పొందండి అని వచ్చే సందేశాలను క్లిక్ చేసి ఓపెన్ చేయవద్దని, ఏపీకే (ఏపీకె) పేరు మీద డాక్యుమెంట్ వస్తుందని, దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయరాదని కలెక్టర్ వివరించారు. పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయని సోషల్ మీడియాలో ప్రలోభపెట్టే యాప్ల జోలికి వెళ్లొద్దన్నారు. ఏ అనుమానం వచ్చినా వెంటనే సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్ 1930కు కాల్ చేయాలని కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త..!