
అప్రమత్తతే ప్రధానం
● కలెక్టర్ శ్యామ్ప్రసాద్
పార్వతీపురం: విపత్తులపట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ అప్రమత్తం చేశారు. నైరుతి రుతుపవనాల కారణంగా కురుస్తున్న వర్షాలపై కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం సంబంధిత అధికారులతో సమీక్షించారు. జిల్లాలో చెరువులు, కాలువలు, రిజర్వాయర్లు ఎక్కువగా ఉన్నాయని, వర్షాకాలంలో ప్రజలకు, పశుసంపదకు, పంటలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా అప్రమత్తం చేయాలన్నారు. ప్రాజెక్టులవద్ద గేట్లు ఎత్తివేసిన సమయంలో దిగువన ఉన్న ప్రాంతాల ప్రజలకు ముందస్తు సమాచారం అందించాలన్నారు. వరదల సమయంలో ప్రజలు పాము, తేలు కాట్లుకు గురయ్యే ప్రమాదం ఉందని, అవసరమైన మందులు సిద్ధం చేయాలని ఆరోగ్యశాఖ అధికారులను అదేశించారు. ఆస్పత్రుల్లో శస్త్రచికిత్సలకు విద్యుత్ అంతరాయం కలగకుండా జనరేటర్లు, ఇన్వెర్టర్లను సిద్ధం చేసుకోవాలన్నారు. తాగునీటిని ఎప్పటికప్పుడు ఇంజినీరింగ్ సహాయకుల ద్వారా పరీక్షించాలన్నారు. రాబోయే మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీచేసినట్టు వెల్లడించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్.ఎస్.శోభిక, డ్వామా పీడీ కె.రామచంద్రరావు, డీఆర్డీఏ పీడీ ఎం.సుధారాణి, ఐసీడీఎస్ పీడీ టి.కనకదుర్గ, తదితరులు పాల్గొన్నారు.