
పునరావృతం కాకూడదు
పీజీఆర్ఎస్లో అర్జీలు
పార్వతీపురం: ప్రజాసమస్యల పరిష్కార వేదికకు వచ్చిన దరఖాస్తులు పునరావృతం కాకూడదని డీఆర్డీఏ పీడీ ఎం.సుధారాణి అన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని పీజీఆర్ఎస్ మందిరంలో జిల్లా వ్యవసాయాధికారి రాబర్ట్పాల్, ఈ సెక్షన్ సూపరింటెండెంట్ శ్రీరామ్మూర్తిలతో కలిసి ప్రజల నుంచి 44 వినతులను ఆమె స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం చూపాలని సూచించారు.
దరఖాస్తుల్లో కొన్ని ఇలా..
● జియ్యమ్మవలస మండలం అర్నాడ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేక నిత్యం ఇబ్బందులు పడుతున్నామని, రానున్న వర్షాకాలంలో విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేందుకు మరింత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని, రోడ్డు నిర్మించాలని గ్రామానికి చెందిన ఎం. సురేష్ అర్జీ అందించారు.
● పార్వతీపురం పట్టణంలోని బెలగాంలో హెడ్పోస్టాఫీసు వీధిలో చెత్త కుండీ ఏర్పాటు చేయకపోవడం వల్ల నిత్యం పందులు సంచరిస్తున్నాయని, దీంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని గిరి పట్నాయక్ ఫిర్యాదు చేశారు.
● మక్కువ మండలం ఎర్ర సామంతవలస గ్రామానికి చెందిన ఆర్. పార్వతమ్మ సర్వే నంబర్ 101లో భూమిని 20ఏళ్లుగా సాగు చేస్తున్నానని కానీ తన భూమిని వేరేవారు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని రికార్డుల ప్రకారం సర్వే చేపట్టి తన భూమి తనకు ఆన్లైన్ చేసి పట్టాదారు పాస్బుక్ మంజూరు చేయాలని కోరారు.
● పార్వతీపురం మండలం జమ్మిడివలస గ్రామానికి చెందిన అల్లు కుమారి వితంతు పింఛన్ మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రాన్ని అందించారు. కార్యక్రమంలో ఉద్యానవనశాఖాధికారి బి.శ్యామల, డీఆర్డీఏ ఏపీడీ సత్యంనాయుడు, జిల్లా పశుసంవర్థకశాఖాధికారి ఎస్. మన్మథరావు, డీపీఓ టి.కొండలరావు, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు.
ఐటీడీఏ గ్రీవెన్స్సెల్కు 23 వినతులు
సీతంపేట: స్థానిక ఐటీడీఏలో సోమవారం ఏపీవో చిన్నబాబు నిర్వహించిన పీజీఆర్ఎస్కు 23 వినతులు వచ్చాయి. సీతంపేటలో ఎంపీహెచ్ఏ పోస్టు ఇప్పించాలని జోగైనాయుడుగూడకు చెందిన సవర లక్ష్మణరావు కోరారు. సవర భాష వలంటీర్ పోస్టు ఇప్పించాలని చీడిగూడకు చెందిన సవర బెనర్జీరావు వినతి అందజేశారు. దబ్బగూడకు చెందిన సవర ముసలమ్మ ట్రాక్టర్ లోన్ ఇప్పించాలని కోరింది. మినీ ఫ్లోర్మిల్ కావాలని బి.భారతి విన్నవించింది. అంటికొండకు చెందిన నిమ్మక సుందరరావు ఉపాధి వేతనాలు పెండింగ్లో ఉన్నవి చెల్లించాలని అర్జీ చేశారు. కార్యక్రమంలో ఈఈ రమాదేవి, డీడీ అన్నదొర, ఏఎంవో కోటిబాబు, స్పోర్ట్స్ ఇన్చార్జ్ జాకాబ్ దయానంద్ తదితరులు పాల్గొన్నారు.

పునరావృతం కాకూడదు