
తలసరి ఆదాయం పెంచడమే లక్ష్యం
● స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ప్రమీళా గాంధీ
గజపతినగరం: స్వర్ణాంధ్ర విజన్ ప్లాన్లో భాగంగా 2047నాటికి తలసరి ఆదాయం 15శాతం పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, ఆదిశగా ప్రతీ ఒక్కరూ పని చేయాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ప్రమీళా గాంధీ అన్నారు. గజపతినగరంలోని గ్రామసచివాలయం–2 పై అంతస్తులో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర –2047 విజన్ ప్లాన్ యూనిట్ను ఎంపీపీ బెల్లాన జ్ఞానదీపికతో కలిసి సోమవారం ఆమె ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ రైతులు సాంప్రదాయ వ్యవసాయంతో పాటు ఉద్యానవన పంటలు సాగు చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ,ఉద్యానవనశాఖ అధికారులు గ్రామాల్లో అవగాహణ సదస్సులు నిర్వహించి రైతులను చైతన్యవంతం చేయాలన్నారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంభించాలని, ప్రభుత్వం రాయితీపై అందిస్తున్న డ్రిప్ ఇరిగేషన్, యంత్రపరికాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆయిల్ పామ్, డ్రాగన్ ప్రూట్, అరటి, బొప్పాయి, జామ, కొబ్బరి వంటి పంటలను సాగు చేసేందుకు ముందుకు వచ్చే రైతుల కు ప్రభుత్వం ప్రోత్సాహకాలు, సహాయ సహకారాలు అందిస్తుందని వివరించారు. జెడ్పీటీసీ సభ్యుడు గార తవుడు, గజపతినగరం, బొండపల్లి, గంట్యాడ మండ లాల తహసీల్దార్లు బి.రత్నకుమార్, డి.రాజేశ్వరరావు, నీలకంఠంరెడ్డి, గజపతినగరం,దత్తిరాజేరు,బొండపల్లి,గంట్యాడ మండలాల ఎంపీడీఓలు బి.కల్యాణి, వై.రాజేంద్ర ప్రసాద్, జి.గిరిబాల, వెంకటరమణమూర్తి, స్థానిక సర్పంచ్ నరవ కొండమ్మ, ఈఓపీఆర్డీ సుగుణాకరరావు, పంచాయతీ ఈఓ జనార్దనరావు, తుమ్మికాపల్లి సర్పంచ్ బెల్లాన త్రినాథరావు, తదితరులు పాల్గొన్నారు.