డీఎస్డీఓ అఫ్రోజ్ ఖాన్
గుంటూరు వెస్ట్ (క్రీడలు): జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మే1వ తేదీ నుంచి 31 వరకు వివిధ క్రీడల్లో వేసవి శిక్షణనిస్తామని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి అఫ్రోజ్ ఖాన్ తెలిపారు. శుక్రవారం స్థానిక బీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన విలేకరలు సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 18 మండలాల్లో 8నుంచి14 సంవత్సరాల వయస్సు గల బాలబాలికలకు శిక్షణ ఏర్పాటు చేస్తున్నామన్నారు. శిబిరంలో ప్రతిభ కనబరచిన వారిని గుర్తించి క్రీడా హాస్టల్స్కు ఎంపిక చేస్తామన్నారు. వివరాలకు బీఆర్ స్టేడియంలో సంప్రదించాలన్నారు. ఈ సమావేశంలో స్టెప్ మేనేజర్ బి.రాధిక, మేనేజర్ సీహెచ్ కొండయ్య పాల్గొన్నారు.
గుంటూరు లీగల్: జిల్లాలో కుటుంబ వివాదాలు పెరుగుతున్న నేపథ్యంలో న్యాయవ్యవస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఉన్న ఫ్యామిలీ కోర్టుకు తోడు, అదనంగా మరో కుటుంబ వివాదాల న్యాయస్థానం ఏర్పాటు చేశారు. నూతన కోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం ఉదయం 10 గంటలకు గుంటూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రఘునందన్ రావు కోర్టును ప్రారంభించనున్నారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బి.కృష్ణమోహన్, జస్టిస్ వెంకటేశ్వర్లు నిమ్మగడ్డ, జస్టిస్ వడ్డిబోయిన సుజాత, జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప్ కార్యక్రమానికి హాజరుకానున్నారు. గుంటూరు జిల్లా, సెషన్న్స్ జడ్జి బి.సాయి కళ్యాణ్ చక్రవర్తి ఆధ్వర్యంలో, గుంటూరు బార్ అసోసియేషన్ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
ఏఎన్యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ స్టడీస్ ఆధ్వర్యంలో శనివారం యువ న్యాయవాదులకు డ్రాఫ్టింగ్, ప్లీడింగ్, కన్వేయన్సింగ్ వంటి అంశాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు విభాగం హెడ్ ప్రొఫెసర్ ఎస్.విజయలక్ష్మి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం ఉదయం 10 గంటలకు న్యాయవిభాగంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్,కామర్స్ అండ్ లా ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం సురేష్ అధ్యక్షత వహిస్తారన్నారు. కీనోట్ స్పీకర్ గా జిల్లా మాజీ జడ్జి జీవీ కృష్ణయ్య, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు డాక్టర్ బి. వెంకట రమణారెడ్డి, నర్రా శ్రీనివాసరావులు హాజరవుతారన్నారు. విద్యార్థులు, యువన్యాయవాదులు వారి అనుభవాన్ని, అమూల్యమైన వృత్తి సలహాలను సద్వినియోగం చేసుకోవాలని విభాగాధిపతి ప్రొఫెసర్ విజయలక్ష్మి కోరారు.
నిర్కా డైరెక్టర్ డాక్టర్ శేషు మాధవ్
కొరిటెపాడు(గుంటూరు): రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ అండ్ కమర్షియల్ అగ్రికల్చర్ (నిర్కా) ప్రధాన లక్ష్యమని ఆ సంస్థ డైరెక్టర్ డాక్టర్ శేషుమాధవ్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం మిర్చియార్డు ఎదుట ఉన్న నిర్కా(పూర్వ సీటీఆర్ఐ) ప్రాంగణంలో జిల్లాలోని గిరిజన రైతులకు సబ్ ప్లాన్ కింద నానో బయోటెక్ ఎరువులు, టార్పాలిన్ పట్టల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి నిర్కా గుంటూరు ఇన్చార్జి డాక్టర్ వి.వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ డాక్టర్ శేషుమాధవ్ మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో రైతులు ఎక్కువగా పొగాకు, పసుపు, మిర్చి వంటి వాణిజ్య పంటలను సాగు చేస్తుంటారని తెలిపారు. అయితే అధిక మోతాదులో ఎరువులు వినియోగిస్తోన్నట్లు తమ దృష్టికి వచ్చిందని, దీని వల్ల మట్టిలో పోషకాలు లేక భూమి సారం కోల్పోతుందన్నారు. అందుకు ప్రత్యామ్నాయంగా ఈ నానో బయోటెక్ ఎరువులను తాము గిరిజన రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. వీటి వల్ల సూక్ష్మజీవులు బాగా పెరిగి పోషకాలు పుష్కలంగా అందడంతో పాటు, పంట ఖర్చు కూడా తగ్గుతుందన్నారు. కార్యక్రమంలో నిర్కా శాస్త్రవేత్త జె.పూర్ణబిందు, టెక్నికల్ ఆఫీసర్ ఎంవీ జయకృష్ణ, సుబ్బారావు, బాపట్ల ఏసు, దీపక్ తదితరులు పాల్గొన్నారు.
గుంటూరు మెడికల్: గుంటూరు మెడికల్ కాలేజీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ చేయకుండా జాప్యం చేయడంపై ‘సాక్షి’ దినపత్రిక ఈనెల 15న ‘నో.. ఫిటికేషన్!’ శీర్షిన జిల్లా ఎడిషన్లో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్వర్మ త్వరితగతిన గుంటూరు జీజీహెచ్, గోరంట్ల ప్రభుత్వ జ్వరాల ఆసుపత్రి, గుంటూరు వైద్య కళాశాలలో భర్తీ కోసం విడుదల చేసిన నోటిఫికేషన్ను స్క్రూట్ని చేసి ప్రొవిజనల్ మెరిట్ లిస్టు విడుదల చేయాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం గుంటూరు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారీ ప్రొవిజనల్ మెరిట్ లిస్టును విడుదల చేశారు. వైద్య కళాశాలలో గత ఏడాది సెప్టెంబరు 9న 61 పోస్టులకు కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చారు. మొత్తం 858 దరఖాస్తులు వచ్చాయి. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నవారు ప్రొవిజనల్ మెరిట్ లిస్టును గుంటూరు మెడికల్ కాలేజ్ అధికారిక వెబ్సైట్లో, జిల్లా కలెక్టర్ కార్యాలయం వెబ్సైట్లో అందుబాటులో ఉంచామన్నారు. అభ్యంతరాలు ఉంటే నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారీ వెల్లడించారు.


