భక్తుల కొంగుబంగారం నేతి వెంకన్న
రేపటి నుంచి తిరునాళ్ల భారీగా తరలిరానున్న భక్తులు
ఉత్సవాలకు సిద్ధమైన దేవస్థానం
తిరుమల నుంచి తెచ్చిన స్వామి విగ్రహం
రాజుపాలెం: జిల్లాలో పల్నాటి తిరుపతిగా వెలుగొందుతున్న దేవరంపాడు కొండ తిరునాళ్ల ఈ నెల 21 నుంచి మార్చి 19వ తేదీ వరకు కొనసాగనుంది. నాలుగు శనివారాలపాటు అత్యంత వైభవంగా వేడుకలు జరగనున్నాయి. ఉగాది పర్వదినంతో ఉత్సవాలు ముగుస్తాయి. మత్స్యరూపంలో దర్శనమిచ్చే శ్రీవెంకటేశ్వరుడికి భక్తులు మొక్కులు చెల్లించి, ప్రత్యేక పూజలు చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా లక్షల్లో ఇక్కడికి తరలిరానున్నారు. ఏటా పాల్గుణ మాసం మొదటి శనివారం రోజున ఈ తిరునాళ్ల ప్రారంభం అవుతుంది. ఉగాది పండుగ రోజు ఉత్సవం నిర్వహించడం ఇక్కడి ఆనవాయితీ. దేవరంపాడు కొండపై ప్రధాన ఉత్సవాలు మూడవ, నాలుగో శనివారాలు అంటే మార్చి 7, 14వ తేదీల్లో జరగనున్నాయి. నేతి వెంకన్న స్వామిగా ప్రసిద్ధి గాంచిన వెంకటేశ్వరుడు మత్స్య రూపంలో స్వయంభూగా వెలసినందున విశిష్ట దైవమని భక్తుల నమ్మకం. పాపాలను నశింపజేసి, సుఖసంతోషాలను ప్రసాదిస్తారని విశ్వసిస్తారు. పశు సంపదకు, పాడి పంటలకు ఆరాధ్య దైవమైనందున సుమారు వందేళ్లుగా భక్తులు ఈ కొండపై స్వామిని పూజిస్తున్నారు. పశువులు ఈనిన తరువాత కవ్వం పెట్టగానే మూడు పూటలు గానీ, ఐదు పూటలు గానీ మీదు కట్టిన వెన్నను తెచ్చి స్వామివారికి పొంగళ్లు పొంగిస్తారు. ఆలయం చుట్టు పశువులను ప్రదక్షిణ చేయించి నెయ్యి, బియ్యం, పప్పు, బెల్లం వగైరాలు భక్తులు సమర్పిస్తారు. ఈ నెల 22వ తేదీన, 28న, మార్చి 7, 14, 19న వేడుకలు వైభవంగా జరగనున్నట్లు ఈవో గణపతి సురేష్ తెలిపారు.
భక్తుల కొంగుబంగారం నేతి వెంకన్న


