జాతీయ రహదారిపై ఆటో బీభత్సం
ఆటో దెబ్బకు కాల్వలో పడిన కారు సీట్ బెల్ట్తో తప్పిన ప్రాణాపాయం అదుపుతప్పిన ఆటో ఢీకొనడంతో దుర్ఘటన.. బైక్ను ఢీకొన్న కారు నలుగురికి గాయాలు
యడ్లపాడు: మండలంలోని 16వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం సినిమా ఫక్కీలో ఆటో ఒకటి.. కారును ఢీకొంది. అదుపుతప్పిన కారు ముందున్న బైక్ను కూడా ఢీకొంది. వరుస ప్రమాదాలకు కారణమైంది. ఈ ఘటనలో మూడు వాహనాలు ధ్వంసం కాగా, నలుగురికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న దంతులూరు (తెనాలి) వాసి జి. నాగేశ్వరరావు తన పదేళ్ల కుమారుడితో కలిసి ఓ శుభకార్యానికి ఏలూరు వెళ్తున్నారు. గురువారం ఉదయం 8 గంటల సమయంలో యడ్లపాడు మండలం తిమ్మాపురం కొత్త బైపాస్ వద్ద వేగంగా వచ్చిన ప్యాసింజర్ ఆటో వీరి కారును వెనుకవైపున ఢీకొంది. అదపుతప్పిన కారు ఎదురుగా ఆగి ఉన్న బైక్ను ఢీకొంది. అంతటితో ఆగక హైవే డివైడర్ మీదుగా నక్కవాగు సమీపంలో కాల్వలోకి వెళ్లి బోల్తా పడింది. తిమ్మాపురం నక్కవాగు లిప్ట్ చప్టా వద్ద ప్రమాదం జరిగింది. కారు, ఆటో ముందుభాగాలు, బైక్ వెనుక భాగం ధ్వంసం అయ్యాయి. నిత్యం రద్దీగా ఉండే అక్కడ ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. కారులో ఉన్న తండ్రీకొడుకులు సీటు బెల్టు ధరించడం, ఎయిర్ బ్యాగ్లు సకాలంలో తెరుచుకోవడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. యడ్లపాడుకు చెందిన ఆటో డ్రైవర్ రాంబాబు, బైక్ నడుపుతున్న చినకోండ్రుపాడు వాసి బాలరాజులు తీవ్రంగా గాయపడ్డారు. హైవే పోలీసులు వచ్చి క్షతగాత్రులను వైద్యశాలకు తరలించారు. యడ్లపాడు ఎస్ఐ టి. శివరామకృష్ణ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


