
అంతర్ జిల్లాల దొంగలు అరెస్ట్
● రూ.25 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్న గుంటూరు పట్టాభిపురం పోలీసులు ● వివరాలు వెల్లడించిన వెస్ట్ డీఎస్పీ కె.అరవింద్
లక్ష్మీపురం: చెడు వ్యసనాలకు అలవాటు పడి, దొంగతనాలు చేయడమే వృత్తిగా చేసుకున్న ముగ్గురు అంతర్ జిల్లాల దొంగలను గురువారం పట్టాభిపురం పోలీసులు అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.25 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నారు. వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ కె.అరవింద్ శుక్రవారం వివరాలు వెల్లడించారు. బుధవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో సీసీఎస్ అధికారులకు, పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు, ఎస్ఐ టి.సుబ్బారావులకు వచ్చిన సమాచారం మేరకు గుంటూరు నగరంలోని చుట్టుగుంట–చిలకలూరిపేట జాతీయ రహదారి వై– జంక్షన్ వద్ద సిబ్బందితో వాహనాలు తనిఖీ చేశారు. వై. జంక్షన్ వైపు నుంచి వస్తున్న ఓ ఆటోలో ఉన్న ముగ్గురు వ్యక్తులతో డ్రైవర్ పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారు. సీఐ గంగా వెంకటేశ్వర్లు సిబ్బందితో కలిసి ముగ్గురిని అదుపులో తీసుకోగా ఉప్పాల సురేష్ పరారయ్యాడు. మిగిలిని ముగ్గురిని స్టేషన్కు తరలించి విచారించారు. ఇందులో పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం, మాదల గ్రామానికి చెందిన తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు అలియాస్ వెంకీపై రాష్ట్ర వ్యాప్తంగా 24 స్నాచింగ్ , ద్విచక్ర వాహనాల దొంగతనాలతో పాటు ఇళ్లలో చోరీ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం గుంటూరు నల్లచెరువులో నివాసం ఉంటున్నాడు. నల్లొండ జిల్లా, పెద్ద అడిచెరల్లపల్లి మండలం, రంగారెడ్డి గూడెం గ్రామానికి చెందిన ఊరడి జనార్దన్ అలియాస్ జానిపై రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో 10 స్నాచింగ్ కేసులు, ద్విచక్ర వాహనం దొంగతనాలతో పాటు ఇళ్లలో చోరీ కేసులు ఉన్నాయి పల్నాడు జిల్లా, ముప్పాళ్ల మండలం, మాదల గ్రామానికి చెందిన తమ్మిశెట్టి మణికంఠపై గుంటూరు నగరంలో పలు చోరీ కేసులు ఉన్నాయి. ఇటీవల అనకాపల్లి రూరల్ పోలీస్లు ముగ్గురిని జూన్ 23న అరెస్ట్ చేసి అనకాపల్లి సబ్ జైలుకు తరలించారు. రిమాండ్ నుంచి మరుసటి రోజు జూన్ 24న బయటకు వచ్చారు.
నగరంలో పలు దొంగతనాలు
గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణానగర్ 4వ లైన్లో బాలాజీ ప్రొడక్ట్స్ సంస్థ కార్యాలయంలో తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు, ఊరడి జనార్దన్, తమ్మిశెట్టి మణికంఠ, ఉప్పాల సురేష్లు కలిసి లక్ష రూపాయలతో పాటు 104 అమెరికా డాలర్స్ను దొంగలించారు. జూలై 12న గుంటూరు నగరాలు ప్రాంతంలో ట్రావెల్స్ నిర్వాహకుడు షేక్ ఫహీమ్ దగ్గరికి వెళ్లి కారు కొనేందుకు వచ్చామని నమ్మించారు. అదే రోజు సాయంత్రం కార్ను ట్రైల్ వేస్తామని చెప్పి అక్కడి నుంచి పరారయ్యారు. జూలై 18న రాత్రి బాపట్ల జిల్లా ఈపూరుపాలెం స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో టీవీ, గాజులు చోరీ చేశారు. జిల్లా ఎస్పీ సతీష్కుమార్ ఆదేశాల మేరకు వెస్ట్ డీఎస్పీ కె.అరవింద్, సీసీఎస్ సిబ్బందితో కలిసి పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు ప్రత్యేక బృందాలుగా ఏర్పడ్డారు. నేరాలకు పాల్పడుతున్న వారి కోసం గాలింపులు, తనిఖీలు ముమ్మరం చేశారు. దీంతో బుధవారం వై.జంక్షన్ వద్ద తనిఖీలలో ఆటోలో నుంచి పరారీ అవుతుండగా నలుగురిలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సొత్తును స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అంతర్ జిల్లాల దొంగలను పట్టుకున్న సిబ్బందిని, సీసీఎస్ అధికారులను, పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు, ఎస్ఐ సుబ్బారావు, ఏఎస్ఐ వీరాంజనేయులు, ఎం.ఆంథోని, హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు, కానిస్టేబుల్ మాణిక్యరావు, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.