
అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి
ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ బాపట్ల జిల్లా కన్వీనర్ వాణిశ్రీ
రేపల్లె: అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వెంటనే వర్తింపజేయాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ బాపట్ల జిల్లా కన్వీనర్ సింగం వాణిశ్రీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రేపల్లె ఐసీడీఎస్ కార్యాలయంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీడీపీవో సుచిత్రకు శుక్రవారం వినతి పత్రాన్ని అందజేశారు. వాణిశ్రీ మాట్లాడుతూ అంగన్వాడీలకు ప్రభుత్వ ఉద్యోగి అనే పదం తొలగించాలని కోరుతూ 23 తేదీ జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నా చేపడుతున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం ఇచ్చినా దానిలో అంగన్వాడీలకు ఇవ్వకుండా మోసం చేసిందని, ఎన్నికలకు ముందు అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్కి అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీనిచ్చి నేడు మొండి చెయ్యి చూపిందన్నారు. గతంలో పిల్లలు చదువుకి సంబంధించిన అమ్మఒడి అమలైందని పేర్కొన్నారు. నేడు కూటమి ప్రభుత్వం ఆదాయ నిబంధనలు పెట్టి సంక్షేమ పథకాలను దూరంచేయటం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగి అనే పదం తొలగించాలని కోరుతూ జూన్ 23న జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద జరిగే ధర్నాలో వర్కర్లు అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్, ఏఐటీయూసీ నాయకులు పడమటి బిక్షాలు, షేక్ బాజీ, నాగమల్లి, జ్యోతి, హేమలత, సీహెచ్ పద్మ, పాప, విజయలక్ష్మి, వై.శారద తదితరులు పాల్గొన్నారు.