
సమ్మెలోకి ఇంజినీరింగ్ విభాగ కార్మికులు
నెహ్రూనగర్: రాష్ట్రవ్యాప్తంగా 22వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ ఇంజినీరింగ్ టౌన్ ప్లానింగ్ అండ్ శానిటేషన్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ గుంటూరు నగరపాలక సంస్థ కమిటీ ప్రధాన కార్యదర్శి రాయపూడి కోటి బాబు తెలియజేశారు. ఈ మేరకు శుక్రవారం నగర మేయర్ కోవెలమూడి రవీంద్రకి సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా కోటి బాబు మాట్లాడుతూ నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల్లోని ఇంజినీరింగ్ విభాగంలో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ కార్మికులకు జీతాలు పెంచాలని పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించినప్పటికీ పట్టించుకోలేదని తెలిపారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఈ నెల 2న కార్మిక సంఘాలను చర్చలకు పిలిచి ఎటువంటి హామీ ఇవ్వలేదని, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చెప్తానని చర్చలను అర్ధంతరంగా ముగించి వెళ్లిపోయారని విమర్శించారు. ఇంతవరకు ప్రభుత్వం నుంచి పిలుపు రాకపోవడంతో ఈనెల 9న వడ్డేశ్వరంలో కమిషనర్ సంపత్ కుమార్ను కలిసి, 22వ తేదీ అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా సమ్మెలోకి వెళ్తున్నామని నోటీసు ఇచ్చినట్లు తెలిపారు.