
వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు వెంటనే ఇవ్వాలి
పిడుగురాళ్ళ: వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు త్వరితగతిన అందించాలని విద్యుత్ శాఖ ఎస్ఈ డాక్టర్ పి.విజయ్ కుమార్ సూచించారు. మాచర్ల డివిజన్ పరిధిలోని అధికారులతో కొండమోడు కార్యాలయంలో శుక్రవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తు అందించాలన్నారు. సరఫరాలో అంతరాయాలు తగ్గించాలని కోరారు. బిల్లుల వసూళ్లలో అలసత్వం వహించిన సిబ్బంది చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సూర్య ఘర్ పథకంపై వినియోగదారులకు అవగాహన కల్పించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల 25వ తేదీలోపు పూర్తి చేయాలని అన్నారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా సిబ్బంది పనితీరు మెరుగుపరుచుకోవాలని కోరారు. 50 శాతం అదనపు లోడు క్రమబద్ధీకరణ సబ్సిడీ స్కీమును వినియోగదారులు ఈ నెల 30వ తేదీ లోపు వినియోగించుకోవాలని సూచించారు. పిడుగురాళ్ల పట్టణ పరిధిలో సరఫరా సమస్యలకు 62817 02413 నంబరుకు ఫోన్ చేయాలన్నారు. ఈఈ నూతలపాటి సింగయ్య, డెప్యూటీ ఈఈ బి.నాగసురేష్ బాబు, ఏఈఈ కోట పెద్ద మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.