
రెవెన్యూ శాఖతో ప్రజలకు నిత్యం అనుబంధం
గుంటూరు జేసీ ఎ.భార్గవ్ తేజ
గుంటూరు వెస్ట్: పుట్టుక నుంచి మరణం వరకు ప్రజలకు రెవెన్యూ శాఖతో అనుబంధం ఉంటుందని జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్తేజ తెలిపారు. స్థానిక రెవెన్యూ కల్యాణ మండపంలో శుక్రవారం రాత్రి రెవెన్యూ డే నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జేసీ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసే అంశంలో మరింత వేగంగా, పారదర్శకంగా రెవెన్యూ సిబ్బంది పని చేయాలని ఆయన సూచించారు. ప్రస్తుత సమాజంలో పని వేగం పెరిగిందని, దీనికి తగ్గట్లు ఉద్యోగులు ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుని ముందుకు వెళ్లాలని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న కార్యక్రమంలో అందిన అర్జీలను అత్యంత వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. ఏపీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ డే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్వహించడం సంతోషమని పేర్కొన్నారు. ఏపీఆర్ఎస్ఏ జిల్లా అధ్యక్షుడు కిరణ్కుమార్ మాట్లాడుతూ రోజురోజుకూ తమ బాధ్యత మరింత పెరుగుతోందని తెలిపారు. ప్రభుత్వాలు కూడా ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు.