
‘యోగా డే‘కు పరేడ్ గ్రౌండ్ సిద్ధం
నరసరావుపేట: కలెక్టరేట్ సమీపంలోని పరేడ్ గ్రౌండ్లో శనివారం ఉదయం అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు శుక్రవారం సాయంత్రం నుంచి నిర్వహిస్తున్నారు. గ్రౌండ్ మొత్తం ఆకుపచ్చ పరదాలతో నింపేశారు. సుమారు 10 వేల మంది యోగాసనాలు సాధన చేసేలా సిద్ధం చేస్తున్నారు. వారికి అవసరమైన తాగునీరుతోపాటు వైద్య శిబిరం అందుబాటులో ఉంచుతున్నారు. కార్యక్రమంలో కలెక్టర్, ఎస్పీ, ఇతర జిల్లా అధికారులు పాల్గొననున్నారు.
న్యాయవాదులకు అవగాహన తరగతులు
గురజాల: జూనియర్ న్యాయవాదులకు శుక్రవారం చట్టాలపై అవగాహన తరగతులు నిర్వహించారు. స్థానిక కోర్టు భవనాలలో జిల్లా జడ్జి జి. ప్రియదర్శిని ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ చట్టాలపై ప్రతిఒక్కరూ లోతుగా అవగాహన కలిగి ఉండాలన్నారు. సీనియర్ సివిల్ జడ్జి వై.శ్రీనివాసరావు, జూనియర్ సివిల్ జడ్జి సత్యనారాయణ, జూనియర్ సివిల్ జడ్జి అలేఖ్య, పీపీ కందిమళ్ల సూర్యరాజు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కోట శ్రీనివాసరావు, న్యాయవాదులు రామిరెడ్డి, హనుమంతరావు, వై.వెంకటేశ్వర్లు, వెంకటేశ్వరరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
నగదు రహిత వైద్యం అందించాలి
నరసరావుపేట: డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవలో పేషెంట్లకు బిల్లులు లేకుండా నగదు రహిత వైద్యం అందించేలా ఆసుపత్రి యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే సూచించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవపై జిల్లా క్రమశిక్షణ కమిటీ సమావేశం జరిగింది. ఫిర్యాదుల కమిటీ సభ్యులు విచారణ చేశారు. డీఎంహెచ్ఓ డాక్టర్ బి.రవి, డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ జి.చంద్రశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.
లాసెట్లో సూర్యతేజకు మూడవ ర్యాంకు
నరసరావుపేట: పట్టణానికి చెందిన బత్తుల నరసింహం, సరస్వతి దంపతుల రెండో కుమారుడు సూర్యతేజ శుక్రవారం ప్రభుత్వం విడుదల చేసిన ఏపీ–లాసెట్ ఫలితాలలో ఓపెన్ కేటగిరీలో మూడో ర్యాంక్ సాధించారు. దివ్యాంగుడైన ఆయన పదో తరగతి, ఇంటర్ ప్రైవేటుగానే పూర్తి చేశారు. ఇంటర్లో 80 శాతం మార్కులు సాధించారు. నేషనల్ లా యూనివర్సిటీ నిర్వహించిన పరీక్షలకు హాజరై ఒడిశా యూనివర్సిటీలో సీటు పొందారు. 15 ఏళ్ల వయస్సులో వచ్చిన స్పాండిలైట్ వ్యాధితో అనారోగ్యానికి గురై ఆ తర్వాత చికిత్స చేయించుకున్నప్పటికీ అంగవైకల్యం వదలలేదు. సామాన్య కుటుంబానికి చెందిన ఆయన తండ్రి, సోదరుడు చిరు వ్యాపారం చేస్తున్నారు. జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలనే పట్టుదల, కృషితో సొంతంగా పరీక్షకు సిద్ధమై ఈ విజయం సాధించినట్లు తల్లితండ్రులు, సోదరుడు తెలిపారు. జీవితంలో ఓ గొప్ప న్యాయవాదిగా, న్యాయమూర్తిగా ఎదగాలనే ఆకాంక్షను సూర్యతేజ వ్యక్తం చేశారు.
23 నుంచి శంకర్ విలాస్ ఫ్లైఓవర్ పనులు
గుంటూరు వెస్ట్: శంకర్ విలాస్ ఫ్లైఓవర్ పనులు ఈ నెల 23వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయని శుక్రవారం గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. తన చాంబర్లో నిర్వహించిన అధికారుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ముందుగా ఏసీ కాలేజీ వైపు నుంచి పనులు ప్రారంభించాలని, దీనికి సంబంధించి సోమవారం నుంచి ట్రాఫిక్ మళ్లింపు చేపట్టాలని ఆదేశించారు. ట్రాఫిక్ పోలీసులు పత్రికలు, మీడియా, సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేయాలని ఆమె చెప్పారు. వాహనదారులకు వీలైనంత వరకు ఇబ్బంది లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

‘యోగా డే‘కు పరేడ్ గ్రౌండ్ సిద్ధం

‘యోగా డే‘కు పరేడ్ గ్రౌండ్ సిద్ధం

‘యోగా డే‘కు పరేడ్ గ్రౌండ్ సిద్ధం