
సాగులో డ్రోన్ల వినియోగం పెంచుదాం
నరసరావుపేట: రైతులు సస్యరక్షణకు డ్రోన్లను ఉపయోగించటం ద్వారా తక్కువ సమయం, ఖర్చుతో సమర్ధవంతంగా పురుగుమందులను పిచికారీ చేయవచ్చని, సాగులో డ్రోన్ల వినియోగం పెంచాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు పేర్కొన్నారు. సాధారణ స్ప్రేయర్తో పిచికారీ చేసేందుకు వీలులేని ప్రదేశాల్లో సైతం డ్రోన్లతో పనిముగించవచ్చని సూచించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో రాయితీపై వ్యవసాయ యంత్రపరికరాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు హాజరయ్యారు. జిల్లాలోని 1267మంది రైతులకు రూ.2.22కోట్ల విలువైన యంత్రపరికాలు అందజేశారు. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ మాట్లాడుతూ ఆధునిక సాంకేతికతను వినియోగించటంలో మహిళలు ముందంజలో ఉండాలని కోరుతూ నాదెండ్ల మండలానికి చెందిన సురేఖ అనే మహిళను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. సూక్ష్మనీటిపారుదల ప్రాజెక్ట్ అధికారి ఆంజనేయులు, జిల్లా వ్యవసాయాధికారి ఐ.మురళి మాట్లాడారు. ఇఫ్కో కంపెనీ రీజినల్ అధికారి లోకేష్ నానో యూరియా, డీఏపీ గురించి వివరించారు. వ్యవసాయ పరికరాలు, రాయితీపై పచ్చిరొట్ట విత్తనాలు, భూసార పరీక్షా విశ్లేషణ పత్రాలు రైతులకు అందజేశారు. సబ్డివిజనల్ వ్యవసాయాధికారి పి.మస్తానమ్మ, వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు.