పర్లాకిమిడి : కొంతమంది బీజేడీ పార్టీలో ఉన్నామని చెబుతూ రెండు రోజుల క్రితం బీజేపీలో చేరడం ఎటువంటి ఆశ్చర్యం కలిగించలేదని బిజూ జనతా దళ్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి అన్నారు. స్థానిక రాంనగర్లో హైటెక్ ప్లాజాలో బుధవారం పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. రానున్న పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, గుసాని సమితి చైర్మన్ ఎన్.వీర్రాజు, గుసాని జెట్పిటిసి బాలరాజు, మాజీ సర్పంచ్ (గారబంద) నీరోభుయ్యాన్, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ఎరగాన రామచంద్రరావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం రెండేళ్లుగా అన్ని వర్గాలనూ మోసం చేస్తోందన్నారు. రైతుల వద్ద ధాన్యం కొంటామని మోసం చేసిందని, కొత్తగా వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేయడం లేదని, ఆయుష్మాన్ ఆరోగ్య కార్డులు కొన్ని ఆస్పత్రుల్లో పనిచేయడం లేదని దుయ్యబట్టారు. అనంతరం గుసాని సమితి బిజేపీ సర్పంచ్ నిరంజన్ కుమార్ శోబోరో బీజేడీలో చేరారు. పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు మరికొందరు మద్దతుదారులు బీజేడీలో చేరారని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ అధ్యక్షుడు గవర తిరుపతిరావు, గుసాని సమితి చైర్మన్ వీర్రాజు, గారబంద బీజేడీ నాయకులు నీరోభుయ్యాన్ తదితరులు పాల్గొన్నారు.


