● పోలీసు దర్యాప్తులో వెల్లడి
రాయగడ: స్థానిక న్యూకాలనీ వద్ద గల పాత్రో ఎలక్రానిక్స్ షోరూమ్లో రెండు లక్షల రుపాయల నగదు దోపిడీ కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు అసలు దొంగ షోరూమ్లో పనిచేస్తున్న క్యాషియర్ రంజిత్ కుమార్ దొళాయిగా గుర్తించి అతనిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. క్యాషియర్ రంజిత్ కుమార్ దొళాయి షోరూమ్ వ్యాపార లావాదేవీలకు సంబంధించిన రెండు లక్షల రుపాయల నగదును సమీపంలో గల ఐడీబీఐ బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు సోమవారం వెళ్లాడు. అతని బ్యాగును ఎవరో గుర్తుతెలియని దుండగులు దొంగిలించినట్లు దొళాయి షోరూమ్ యజమానికి తెలియజేశాడు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు సమీపంలో గల సీసీ కెమెరాలను తనిఖీ చేశారు. దొళాయి చెప్పిన విధంగా ఎటువంటి ఆచూకీ లభించలేదు. దీంతో అనుమానించి దొళాయిని అదుపులోకి తీసుకుని విచారించగా.. తానే ఈ నగదును కాజేసిట్లు పోలీసులు ఎదుట అంగీకరించారు. దీంతో పోలీసులు అతని నుంచి రూ.1,20,000 స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.


