భువనేశ్వర్: వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరాకు అంతరాయం ఏర్పడితే రాష్ట్రంలో హోటల్, రెస్టారెంటు వ్యాపార రంగం తీవ్రంగా ప్రభావితం అవుతుందని రాష్ట్ర హోటల్, రెస్టారెంట్ అసోసియేషన్ హరో ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంలో ప్రభుత్వం తక్షణమే చొరవ కల్పించుకోవాలని ఆ సంఘం కోరింది. హోటల్ పరిశ్రమకు గ్యాస్ సరఫరాను నిలిపివేయవద్దనే అభ్యర్థనతో హరో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రికి లేఖ రాసినట్లు సంఘం అధ్యక్షుడు జేకే మహంతి మీడియాకు వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈ లేఖ ప్రతిని జారీ పంపినట్లు తెలిపారు. హొటళ్లు, రెస్టారెంట్ల దైనందిన కార్యకలాపాలు ఎల్పీజీతో ముడిపడి ఉంటాయి. వాటి సరఫరా అకస్మాత్తుగా నిలిపివేయడం లేదా సరఫరా కుదించడం వల్ల ఆహార తయారీ ప్రభావితం అవుతుందని ఆయన అన్నారు. రెస్టారెంట్లు మూసివేయాల్సి రావచ్చు. బుకింగ్లు రద్దు చేసే అవకాశం ఉంది. ఇది హోటల్ పరిశ్రమను మాత్రమే కాకుండా పర్యాటక రంగాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఒడిశాలోని హోటల్ పరిశ్రమలో 50,000 మంది పనిచేస్తున్నారు, వారు కూడా ప్రభావితం అవుతారు. ప్రస్తుతానికి 3 నుంచి 4 రోజులకు సరిపడే గ్యాస్ అందుబాటులో ఉంది. సిలిండర్లు మునుపటిలా సరఫరా చేయకపోతే హోటల్ పరిశ్రమ మూతబడుతుందని హరో చైర్మన్ తెలియజేశారు. ఈ పరిస్థితి తలెత్తకుండా వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల సరఫరా సజావుగా కొనసాగేలా చర్యలు చేపట్టాలని హరొ అభ్యర్థన పత్రంలో పేర్కొంది.


