భువనేశ్వర్: స్థానిక యూనిట్–3 ఇడ్కో ప్రదర్శన మైదానంలో కొనసాగుతున్న భారత న్యాయ సంహిత ప్రదర్శనని మరో 2 రోజులపాటు పొడిగించినట్లు ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి మంగళ వారం ప్రకటించారు. ముందస్తు కార్యక్రమం ఈ ప్రదర్శన ఈ నెల 10తో ముగియాల్సింది. ఈ ప్రదర్శన ఇప్పుడు ఈ నెల 12 వరకు తెరిచి ఉంటుంది. ఇలాంటి ప్రదర్శనల ద్వారా సామాన్యులు ప్రధానంగా యువత, విద్యార్థులు, దేశంలోని కొత్త న్యాయ వ్యవస్థ గురించి మరింత అవగాహన పొందేందుకు వీలవుతుందన్నారు. మంగళవారం ముఖ్యమంత్రి ఈ ప్రదర్శన సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పౌరుల రక్షణకు ప్రాధాన్యతతో భారతీయ విలువలతో కొత్త న్యాయ వ్యవస్థ భారత ప్రజాస్వామ్యంలో మైలురాయిగా నిలిచి భారత దేశ నేర నియంత్రణ చట్రంలో వలసరాజ్యాల యుగానికి తెర దించిందన్నారు. భారత న్యాయ సంహితలోని సంస్కరణ చర్యలు ముఖ్యంగా వేగవంతమైన న్యాయం ప్రదానం, నేర పరిశోధనలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం, సామాన్యుల హక్కులను బలోపేతం చేయడం వంటి చర్యలు ప్రశంసనీయమని కొనియాడారు. భారత న్యాయ సంహిత అమలు చేసినప్పటి నుంచి 2025 చివరి నాటికి రాష్ట్రంలో దోషుల శిక్ష రేటు 87.6 శాతం పెరిగిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. బాధితులు అధికార పరిధితో సంబంధం లేకుండా ఏ పోలీస్ స్టేషన్లోనైనా ఫిర్యాదులు దాఖలు చేసుకునే అవకాశం అందుబాటులోకి వచ్చిందన్నారు.
ముఖ్యమంత్రి ప్రకటన


