రాయగడ: రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. జిల్లాలోని బిసంకటక్ సమితి దుర్గి గ్రామానికి సమీపంలో గల జగన్నాథ మందిరం వద్ద మంగళవారం చోటు చేసుకున్న ఈ ఘటనలో మృతులు రామనగుడ సమితిలొని శుండిధముని పంచాయతీలొ గల బొడిబటొ పులిసి గ్రామానికి చెందిన ఆకాశ్ మండంగి (25), కొలనార సమితి పరిధిలో గల బురుజుగుడ గ్రామానికి చెందిన వీరసింగ్ హికక (29)గా గుర్తించగా మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం మంగళవారం నాడు దుర్గి గ్రామం సమీపంలో గల జగన్నాథ మందిరం వద్ద ఎదురెదురుగా రెండు బైకులు బలంగా ఢీకొనడంతో ఇద్దరు తీవ్రగాయాలతో సంఘటన స్థలం వద్దే మృతి చెందగా మరొకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ప్రమాదంలొ రెండు బైకులు నుజ్జునుజ్జయ్యాయి. మరొకరి మృతదేహం పొలాల పొదల్లో పడిఉంది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.


