జయపురం: సబ్ డివిజన్ పరిధి బొరిగుమ్మ పట్టణం ప్రధాన కూడలి వద్ద గిరిజన నేత, స్వాతంత్య్ర సమరయోధుడు సాహిద్ లక్ష్మణ్ నాయక్ విగ్రహాన్ని ప్రతిష్టించాలని బొరిగుమ్మ ఆదివాసీ జాగరణ మంచ్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆదివాసీ జాగరణ మంచ్ అధ్యక్షుడు సత్యనారాయణ నాయక్ నేతృత్వంలో పలువురు ఆదివాసీ నేతలు జయపురం సబ్ కలెక్టర్ అక్కవరం శొశ్యారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. బొయిపరిగుడ సమితి తెంతులిఖుంటి గ్రామంలో జన్మించిన లక్ష్మణ నాయక్ స్వాతంత్య్రం కోసం తన ప్రాణాలను త్యాగం చేశాడని గుర్తు చేశారు. అతని స్మృతి చిహ్నంగా బొరిగుమ్మ ప్రధాన కూడలి వద్ద విగ్రహాన్ని ప్రతిష్టించాలని కోరారు. కార్యక్రమంలో ఆదివాసీ జాగరణ మంచ్ ఉపాధ్యక్షుడు కొములు జాని, న్యాయ సలహాదారు హరీష్ ముదులి, మంచ్ సభ్యులు ప్రకాశ్ కుమార్ జాని, శామ జాని, పితబాష్ హల్వా, చయితన భొత్ర తదితరులు పాల్గొన్నారు.


