పర్లాకిమిడి: మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలని పురపాలక సంఘం చైర్పర్సన్ నిర్మలా శెఠి అన్నారు. సఖి వన్స్టాప్ సెంటర్, ఐఎస్ఆర్డీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ హాల్ నంబర్–2లో ముందస్తుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని శనివారం జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని, హక్కులను కాపాడుకోవడానికి ఉన్నత విద్యనభ్యసించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం మిషన్ శక్తి, సుభద్ర పథకం, మహిళ స్వయం సహాయక గ్రూపులు, మిషన్ కేఫ్లు అందజేసి వారి ఆర్థికాభివృద్ధికి ప్రోత్సాహం అందజేస్తోందని ఏడీఎం ఫల్గునీ మఝి అన్నారు. మిషన్ శక్తి ద్వారా మహిళలు అభివృద్ధి చెందడమే కాకుండా.. మరికొంత మంది మహిళలకు ఆదర్శప్రాయం అవుతున్నారని ఓఎల్ఎం జిల్లా ప్రోగ్రాం అధికారి టిమోన్బోరా అన్నారు. అనంతరం వివిధ పోటీల్లో గెలిపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమానికి మెడికల్ ఆఫీసర్ సునీతా బెహర అధ్యక్షత వహించగా ప్రోగ్రాం అధికారి సరలా పాత్రో, ఐఎస్ఆర్డీ ప్రోగ్రాం అధికారి నాగేశ్వర చౌదరి, సామాజిక కార్యకర్త జాస్మిన్ షేక్ తదితరులు పాల్గొన్నారు.


