రాయగడ: విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలనే లక్ష్యంతో పీఎం శ్రీ యోజన ప్రారంభమైందని కలెక్టర్ అశుతోష్ కులకర్ణి అన్నారు. స్థానిక గోవింద చంద్రదేవ్ ఉన్నత పాఠశాల మైదానంలో శుక్రవారం నుంచి జిల్లాస్థాయి పీఎంశ్రీ ఉత్సవాలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. రెండు రోజుల పాటుగా జరిగే ఈ ఉత్సవాల్లో వివిధ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని ప్రభుత్వ పాఠశాలలను మోడల్ పాఠశాలలుగా తీర్చిదిద్దడంతో పాటు జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయడమే పీఎంశ్రీ యోజన ముఖ్య ఉద్దేశమని వివరించారు. దీనివలన విద్యార్థులు మెరుగైన విద్యను అభ్యసించే అవకాశం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. చదువుతోనే విద్యార్థుల భవిత ఆధారపడి ఉంటుందని, ఇటువంటి సదావకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రామచంద్ర నాహక్, జిల్లా అదనపు విద్యాశాఖ అధికారి భజన్ లాల్ మాఝి, గోవింద చంద్రదేవ్ ఉన్నత పాఠశాల హెచ్ఎం నమితా ప్రధాన్ తదితరులు పాల్గొన్నారు.


