
మహిళను వేధించిన ముగ్గురు అరెస్టు
జయపురం: ఒక మహిళను శారీరకంగా, మానసికంగా వేధించిన కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్లు జయపురం మహిళా పోలీసులు శుక్రవారం వెల్లడించారు. జయపురం సమితి ధనపూర్ పంచాయతీ బొడొకావిడికి చెందిన లావణ్య నాగ్ తనను భర్త, అత్త మరిదిలు మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు. పోలీసుల వివరణ ప్రకారం రెండేళ్ల కిందట లావణ్యకు, రాజా సాగరియతో వివాహం జరిగింది. ఏడాది పాటు వారు బాగానే ఉన్నారు. తర్వాత అత్తింటి వారు ప్రతి విషయానికి తిడుతూ కొడుతూ ఉన్నారని, ఆ వేధింపులు భరించలేక జయపురం ప్రసాదరావు పేటలో ప్రాంతంలో ఒక ఇల్లు అద్దెకు తీసుకొని లావణ్య ఉంటున్నారు. అక్కడకు కూడా వచ్చి కొడుతున్నట్లు ఫిర్యాదులో ఆరోపించింది. గత నెల 28వ తేదీన ఆమె మరిది ఇంటికి వచ్చి తిడుతూ ఆమె నుంచి బిడ్డను బలవంతంగా తీసుకువెళ్లేందుకు ప్రయత్నించాడని, ప్రతిఘటించటంతో కొట్టి బెదిరించి వెళ్లాడని ఆమె ఫిర్యాదు చేసినట్లు పోలీసు అధికారి వెల్లడించారు. తనకు ప్రాణాపాయం ఉందని తనకు రక్షణ కల్పించాలని ఆమె ఫిర్యాదులో కోరింది. కేసు నమోదు చేసి ఏఎస్ఐ బికాశ చంఽధ్ర నాయిక్ దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు.
కలెక్టర్ బాధ్యతల స్వీకరణ
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కలెక్టర్గా నియమితులైన సోమేశ్ కుమార్ ఉపాధ్యాయ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు కార్యాలయ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా జిల్లా విలేకరుల సంఘం ప్రతినిధులు నూతన కలెక్టర్కు పుష్పగుచ్ఛం అందజేసి అభినందించారు.
డాక్టర్ల కొరత తీర్చాలని కాంగ్రెస్ డిమాండ్
పర్లాకిమిడి: జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్లు, నర్సుసిబ్బంది కొరత వల్ల చుట్టుప్రక్కల నుండి వస్తున్న రోగులకు సేవలు అందటం లేదని ఎమ్మెల్యే మోహానా ప్రతినిధి ఈశ్వర చంద్ర మఝి, మాజీ వైస్ చైర్మన్ సంజయ్ అధికారి, అశోక్ అధికారులు తెలియజేశారు. శుక్రవారం ఆదనపు వైద్యాధికారికి ఒక వినతి పత్రాన్ని అందజేశారు. నెలరోజుల లోపు హెడ్క్వార్టర్ ఆసుపత్రిలో డాక్టర్లు నియామకం చేపట్టకుంటే ఆసుపత్రి వద్ద ధర్నా ఆందోళన చేపడతామని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు జాస్మిన్ షేక్ అన్నారు.
దాడి ఘటనలో నిందితుడి అరెస్టు
జయపురం: జయపురం సమితి పాత్రోపుట్ పెట్రోల్ బంక్లో పనిచేసే రాజేంద్రఖిలోపై కత్తితో దాడి చేసి గొంతు కోసి హత్య చేయటానికి ప్రయత్నించిన దుండగులు పరారైన విషయం విదితమే. పరారీలో దుండగులలో ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు జయపురం సదర్ పోలీసు అధికారి సచిన్ ప్రధాన్ నేడు వెల్లడించారు. అదుపులోనికి తీసుకోబడిన వ్యక్తి జయపురం సమితి ఉమ్మిరి గ్రామస్తుడని తెలిపారు. అతడి వద్ద రాజేంద్రపై దాడికి వినియోగించిన ఆటోను సీజ్ చేసినట్లు ప్రధాన్ వెల్లడించారు.
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
టెక్కలి రూరల్: స్థానిక పట్టుమహాదేవి కోనేరు గట్టుపై శుక్రవారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మృతుడి వయసు సుమారు 40 ఏళ్లు ఉంటుందని, రెండు రోజులుగా టెక్కలిలోనే తిరిగాడని స్థానికులు చెబుతున్నారు. గురువారం రాత్రి సమీప షాపుల బయట పడుకుని ఉదయం వెళ్లిపోయాడని, మధ్యాహ్నానికి మృతి చెంది కనిపించాడని అంటున్నారు. మృతుడు నీలం టీషర్టు, ట్రాక్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. వివరాలు తెలిసిన వారు పోలీసులకు తెలియజేయాలని ఎస్ఐ రాము కోరారు.
రెడ్డీస్లో బ్యాటరీలు చోరీ
రణస్థలం: పైడిభీమవరం పారిశ్రామికవాడలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటీస్ సీటీవో–6 పరిశ్రమలో గత నెల 23న నాలుగు పెద్ద బ్యాటరీలు చోరీ జరిగినట్లు జె.ఆర్.పురం పోలీసులు తెలిపారు. పరిశ్రమ యాజమాన్య ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎస్.చిరంజీవి శుక్రవారం చెప్పారు.

మహిళను వేధించిన ముగ్గురు అరెస్టు